
పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగిలో అతిపెద్ద భారీ ట్రక్కును చూసి స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. చూడాడనికి ఏడు అంతస్తుల బిల్డింగ్ మాదిరి కనిపిస్తున్న అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్ను తీసుకొని, ఈ వాహనం 30 రోజుల క్రితం పుణే నుంచి తమిళనాడులోని కాంచిపురం బయలుదేరింది. జాతీయ రహదారి 163పై ఈ వాహనానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడడంతో ఆయా శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తోంది. ఆదివారం రాత్రి పరిగికి చేరుకున్న ఈ ట్రక్కు.. పట్టణం దాటేందుకు రెండు రోజులు టైం పడుతుందని డ్రైవర్ తెలిపాడు.
ముఖ్యంగా విద్యుత్ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అవసరమైన చోట కరెంట్ను నియంత్రించి, సూచిక బోర్డులు తొలగిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. టోల్ గేట్లు ఉన్న హైవేలో వెళ్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని సాధ్యమైనంతవరకు టోల్గేట్ లేని మార్గాన వెళ్లేందుకు మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. ట్రక్కును నడిపేందుకు మొత్తం 15 మంది పనిచేస్తుంగా, రోజుకు 20 నుంచి 30 కి.మీ. వెళ్తున్నామని వివరించాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్ మరో ట్రాన్స్ ఫార్మర్పనితీరును పరిశీలిస్తుందని తెలిపారు.