V6 News

బాలింత మరణాలు తగ్గుతున్నయ్

బాలింత మరణాలు తగ్గుతున్నయ్
  • రాష్ట్రంలో 5%, దేశవ్యాప్తంగా 6% తగ్గిన కేసులు
  • 2016లో ప్రతి లక్ష జననాలకు 130 మంది తల్లులు మృతి
  • 2017లో ఆ సంఖ్య 122కు తగ్గుదల
  • రిజిస్ర్టార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక విడుదల  

హైదరాబాద్‌, వెలుగు: దేశంలో ప్రసవాల సందర్భంగా తల్లుల మరణాలు (మెటర్నల్ డెత్స్) 6 శాతం తగ్గాయి. రాష్ట్రంలోనూ5 శాతం మేరకు తగ్గాయి. అయితే, 2017 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జననాలకు122 మంది తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారని  రిజిస్ట్రార్‌‌ జనరల్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (ఎస్ఆర్ఎస్)లో భాగంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ (ఎంఎంఆర్) లెక్కలను కూడా రిజిస్ట్రార్‌‌ జనరల్ ఆఫ్ ఇండియా రికార్డ్ చేసింది. దీనికి సంబంధించిన నివేదికను ఇటీవల విడుదల చేసింది.

అస్సాంలో ఎక్కువ.. కేరళలో తక్కువ 

2014–16 సంవత్సరాల దేశ సగటు ఎంఎంఆర్‌‌130 ఉంటే, 2015–17 సంవత్సరాల సగటు ఎంఎంఆర్‌‌122కు తగ్గినట్టు నివేదిక వెల్లడించింది. ఈ మేరకు దేశంలోని రాష్ర్టాలను3 భాగాలుగా విభజించి చేసిన సర్వే ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. అస్సాం, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్, ఒడిషా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాలను ఒక పార్ట్‌(ఎంపవర్‌‌డ్‌ యాక్షన్ గ్రూప్‌)గా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాలను ఒక పార్ట్‌(సౌత్‌ స్టేట్స్‌)గా, మిగిలిన రాష్ర్టాలను మరో భాగంగా విభజించి సర్వే ఫలితాలను వెల్లడించారు. ఎంపవర్‌‌డ్ యాక్షన్ గ్రూప్‌ రాష్ర్టాల్లో మెటర్నల్ మోర్టాలిటీ రేట్‌175 ఉండగా, సౌత్ స్టేట్స్‌లో 72, ఇతర రాష్ర్టాల్లో 90 ఉంది. ఇక అత్యధికంగా అస్సాంలో ప్రతి లక్షకు 229 మెటర్నల్ డెత్స్ నమోదవుతుండగా, అత్యల్పంగా కేరళలో 42 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి.

రాష్ట్రంలో 5% తగ్గిన ఎంఎంఆర్‌‌

దక్షిణాది రాష్ర్టాల సగటు ఎంఎంఆర్‌‌ గతంలో 77 ఉండగా, ఇప్పుడు72కు తగ్గింది. ఇందులో 97 మెటర్నల్‌ డెత్స్‌తో కర్ణాటక తొలి స్థానంలో ఉంది. తెలంగాణలో ఎంఎంఆర్‌‌ గతంలో 81 ఉంటే, ఇప్పుడు 5% తగ్గి76కు చేరింది. ఇక మెటర్నల్ డెత్స్‌లో అత్యధికంగా24 ఏండ్ల లోపు వయసు యువతులవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి వంద మెటర్నల్ డెత్స్‌లో15 నుంచి19 ఏండ్లలోపు వయసున్న తల్లుల మరణాలు 4%, 20 నుంచి 29 ఏండ్ల లోపు తల్లుల మరణాలు34% ఉంటున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. చిన్న వయసులో పెండ్లిళ్లు కావడం, పోషకాహార లోపం, రక్త హీనత వంటివి ఎక్కువగా మెటర్నల్ మరణాలకు దారి తీస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.

Maternal Deaths is on the decline in india