- మారిషస్లో రామ భజనం కార్యక్రమానికి సహకరిస్తామని భట్టి హామీ
హైదరాబాద్, వెలుగు: మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మంత్రి లచ్మునా రాజ్ పెంటియా బృందం శనివారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. మారిషస్లో తెలుగు భాష, సంస్కృతి, పురాణ ఇతిహాసాలను ప్రమోట్ చేసేందుకు ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తామని మారిషస్ ప్రతినిధులకు ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం, మారిషస్ మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నామని గుర్తుచేశారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ద్వారా తెలంగాణకు మారిషస్తో ప్రత్యేక అనుబంధం ఉందని భట్టి పేర్కొన్నారు.
మారిషస్లోని తెలుగు సమాజం అక్కడి గొప్ప బహుళ సాంస్కృతిక సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉందన్నారు. మారిషస్ ప్రభుత్వం చేపడుతున్న ‘రామ భజనం’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. విద్య, సాంస్కృతిక పరిశోధన, కళలు, భాష, సాంస్కృతిక అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందిస్తుందన్నారు. మారిషస్లోని తెలుగు కల్చరల్ సెంటర్లో లక్షలాది మంది తెలుగు ప్రవాసులు తమ సంస్కృతి, సంప్రదాయాలను, భాష పరిరక్షణ చేస్తున్నారని మారిషస్ మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు, తెలుగు భాష, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషి పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
