
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ‘పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తాను. కండువా కప్పుకున్న రోజు నుంచే నేను పార్టీ కార్యకర్తను. కొత్తగా వచ్చిన నేతలకు పదవి రాదు అనేది ఏమి లేదు. హిమంత బిశ్వశర్మకు సీఎం పదవే వచ్చింది. క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు’ అని అన్నారు.
తెలంగాణ రాజకీయాలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అధికారులు అంతా కేసీఆర్ పేరే చెబుతున్నారని అన్నారు. అన్ని వేళ్లు కేసీఆర్వైపే చూపిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదని అన్నారు.