- మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి మెటీరియల్ను సక్రమంగా అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ మెటీరియల్ను ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఎంపీడీవో ఆఫీసును పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మండలంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రేయాంత్, అధికారులు శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.
వాహనాల తనిఖీలు ముమ్మరం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ వీడియోలు తీశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హవేలీ ఘనపూర్ మండల పరిధిలో కూడా ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు.
