
- అన్ని పంటలు కలిసి 3.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా
- అత్యధికంగా 3.05 ఎకరాల్లో వరి
మెదక్, వెలుగు: తొలకరి ముందస్తుగానే పలకరించడంతో వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం ప్రారంభించడంతో పాటు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు. ఈ సీజన్లో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 3,50,164 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా 3.6 ఎకరాల్లో వరి పండించనున్నారు. వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో సన్నాలను సాగు చేయించడానికి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
విత్తనాలు, ఎరువుల అవసరం ఇలా..
వానాకాలం సీజన్లో సాగు చేసేందుకు వరి విత్తనాలు 91,530 క్వింటాళ్లు, పత్తి 74,400 పాకెట్లు, మొక్కజొన్న 264 క్వింటాళ్లు, కంది 90 క్వింటాళ్లు, పెసర 90 క్వింటాళ్లు, మినుము 33 క్వింటాళ్లు, జొన్న 6 క్వింటాళ్లు అవసరమవుతున్నాయి. కాంప్లెక్స్ ఎరువులు 28,400 టన్నులు, యూరియా 25 వేల టన్నులు, డీఏపీ1,912 టన్నులు, మ్యూరేట్ఆఫ్పొటాష్2,118 టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్615 టన్నులు అవసరం కానున్నాయి. ఈ మేరకు పీఏసీఎస్, రైతు ఆగ్రో సేవా కేంద్రాలు, ప్రైవేట్డీలర్ల వద్ద అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది.
టాస్క్ఫోర్స్ తనిఖీలు..
రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడడంతోపాటు, నకిలీ విత్తనాలను అరికట్టడంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టింది. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీస్అధికారులతో కలిపి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ సైతం ఫర్టిలైజర్ షాప్లను, రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించొద్దని డీలర్లకు సూచిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మాలని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.