- వీసీలు, ఈసీల నియామక ప్రక్రియ షురూ
- నెల రోజుల్లోప్రాసెస్ పూర్తయ్యే అవకాశం
- ఎగ్జిక్యూటి వ్ కమిటీల నియామకానికీ సర్కారు కసరత్తు
రాష్ట్ర యూనివర్సిటీల్లో కొత్త వైస్చాన్స్లర్ల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. వీసీల కాలపరిమితి ముగిసిన రెండు నెలలకు, వీసీల నియామకం కోసంసెర్చ్ కమిటీలను వేసిన సర్కారు.. ప్రస్తుతం ఆ కమిటీ సమావేశాలను నిర్వహించే పనిలో నిమగ్నమైంది. పనిలో పనిగా ఏండ్ల నుంచి వర్సిటీల్లో కనిపించని ఎగ్జిక్యూటీవ్ కమిటీ(ఈసీ)లనూ నియమించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో11 యూనివర్సిటీలుండగా, వాటిలో10 యూనివర్సిటీలకు వీసీల్లేరు. ఆర్జీయూకేటీ(బాసర ఐఐఐటీ) మినహా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, పొట్టి శ్రీరాములు తెలుగు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో వీసీల నియామకాల కోసం ప్రభుత్వం జులై 23న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 9 వీసీ పోస్టులకు 984 అప్లికేషన్లు అందాయి. అప్లికేషన్లు వచ్చినా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత నెల 24న యూనివర్సిటీలపై సమీక్ష సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఉన్నతవిద్యామండలి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అదే తేదీన 9 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించింది. ఈ నెల3న వర్సిటీలపై గవర్నర్ సమీక్ష నిర్వహించారు. దాదాపు వీసీలంతా ఇన్చార్జీలే ఉండటంపై ఆమె ఆరా తీసినట్టు తెలిసింది.
నెల రోజుల్లో ప్రాసెస్ పూర్తి..
సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వారం క్రితమే యూజీసీ, వర్సిటీ నామినీ సభ్యుల ఫోన్ నెంబర్లను సేకరించింది. మీటింగ్లు పెట్టేందుకు వారి సమయాన్ని అడుగుతోంది. దసరా తర్వాత సెర్చ్కమిటీల మీటింగ్లకు షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కో యూనివర్సిటీకి వీసీగా ముగ్గురి పేర్లను సెర్చ్ కమిటీ నామినేట్ చేయాల్సి ఉంది. వారిలో ఒకర్ని గవర్నర్ ఎంపిక చేస్తారు. నెలరోజుల్లో ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వర్సిటీలకు కొత్త ఈసీలు కూడా త్వరలోనే కొలువుదీరనున్నాయి. ఒక్కో వర్సిటీలో 8 నుంచి13 మందిని ఈసీ మెంబర్స్గా నియమించనున్నారు. తెలంగాణ వచ్చాక ఒక్క వర్సిటీకి కూడా పాలక మండలిని నియమించలేదు. దీంతో వర్సిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోయాయి.