- దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్న అమిత్ షా
- మళ్లింపు వాటాపై తెలంగాణ పట్టు
- గోదావరి– కావేరి అనుసంధానంపై చర్చ
హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీళ్ల పంచాయితీలకు పరిష్కారం చూపేందుకు కేంద్రం సిద్ధమైంది. మార్చి 4న ఏపీలోని తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సీఎంలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జల వివాదాలపై ఇప్పటికే కృష్ణా బోర్డు ఈ సమావేశానికి ఎజెండా రెడీ చేసింది. గోదావరి, కృష్ణా నదులపై రెండు రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులతో పాటు నదుల అనుసంధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇవీ పంచాయితీలు
దక్షిణాది రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి, కావేరి, పెరియార్ నదీ జలాలపై వివాదాలున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ముళ్లపెరియార్ డ్యాం నీటి విడుదల విషయంలో ఏటా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో కర్నాటక ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ, ఏపీ అభ్యంతరం చెప్తున్నాయి. తెలంగాణ, ఏపీ మధ్య అనేక ప్రాజెక్టుల విషయంలో ఎడతెగని వివాదాలున్నాయి. వీటికి పరిష్కారం చూపాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో మార్చి 4న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కృష్ణా, గోదావరి బోర్డులు ఎజెండా అంశాలను కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ సెక్రటరీకి, ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపాయి.
బోర్డుల ఎజెండాలు ఇవీ..
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఫోర్షోర్లో తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి (డిండి) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న గుండ్రేవుల రిజర్వాయర్పై సమావేశంలో చర్చించాలని కృష్ణా బోర్డు తన ఎజెండాలో ప్రతిపాదించింది. కేఆర్ఎంబీ సమావేశాలతో పాటు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల డీపీఆర్లు ఇచ్చి సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలని ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు డీపీఆర్ ఇవ్వలేదని ఎజెండాలో కృష్ణా బోర్డు పేర్కొంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఎజెండాలో చేర్చిన అంశాల ప్రస్తుత స్టేటస్ను వీలైనంత త్వరగా బోర్డుకు అందజేయాలని ఆదేశించింది. గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం థర్డ్ టీఎంసీతో పాటు సీతారామ, కంతనపల్లి, దేవాదుల థర్డ్ ఫేజ్ ప్రాజెక్టులపై చర్చించాలని గోదావరి బోర్డు సూచించింది. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్లతో పాటు ఇతర అనుమతులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పలుమార్లు కోరినా తెలంగాణ ఇంతవరకూ ఇవ్వలేదని తెలిపింది. ఏపీలో గోదావరిపై చేపట్టిన పురుషోత్తపట్నం, పట్టిసీమపైనా సమావేశంలో చర్చించాలని సూచించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టుల పనుల పరిస్థితి, ఇతర అంశాలు బోర్డుకు అందజేయాలని కోరింది.
మళ్లింపు వాటాపై తెలంగాణ పట్టు
పోలవరం (పట్టిసీమ) నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లను ప్రత్యామ్నాయంగా శ్రీశైలంలో 45 టీఎంసీల నికర జలాలపై సమావేశంలో పట్టుబట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. పోలవరం ప్రాజెక్టులకు అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్కు ఎగువన 80 టీఎంసీల నికర జలాలను ఆయా ప్రాంతాలకు కేటాయించాలని బచావత్ అవార్డులోనే సూచించారనే విషయాన్ని ప్రస్తావించనుంది. కర్నాటక, మహారాష్ట్ర 35 టీఎంసీల నీటిని ఇప్పటికే ఉపయోగించుకుంటున్నాయని, తమకు 45 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిని సీఎం కేసీఆర్ కోరనున్నారు. పోలవరం ఎత్తు పెంపుతో తెలంగాణలో ముంపు పెరిగే ప్రమాదముందని, దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని చెప్పనున్నారు. ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపైనా మరోమారు ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ఏర్పాటుకు నీళ్ల విషయంలో వివక్షే ప్రధాన కారణమనే విషయాన్ని మరోసారి గట్టిగా చెప్పనున్నట్టు తెలిసింది.
రివర్ లింకింగ్పైనా..
గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం అంశాన్ని సదరన్ జోనల్ కౌన్సిల్ ఎజెండాలో చేర్చారు. చెన్నై మహానగరంతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు రివర్ లింకింగ్ తప్పనిసరి అని తమిళ నాడు కోరుతోంది. గోదావరిలో మిగులు జలాలే లేవని ఏపీ, తెలంగాణ వాదిస్తున్నా యి. మహానది నుంచి మొదట గోదావరికి లింక్ చేయాలని, ఆ తర్వాతే కావేరి లింక్ చేపట్టాలని తెలంగాణ ఇప్పటికే చెప్పింది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి నదుల అనుసంధానం చేస్తే ఉపయోగమో పూర్తిస్థాయిలో చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి
చదువుకున్నోళ్ల ఓటు ఎవరికి..? గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టెన్షన్