మెగా జాబ్​మేళాకు అంతా రెడీ

మెగా జాబ్​మేళాకు అంతా రెడీ
  • 18వ తేదీలోపు దరాఖాస్తుకు అవకాశం
  • నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం..!
  • పది ఫెయిలైనవారి నుంచి పీజీ చదివినవారికి..
  • పోలీస్​శాఖ ఆధ్వర్యంలో 21న నిర్వహణ

ఖమ్మం, వెలుగు: 
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీసులు మెగా జాబ్​మేళా నిర్వహించనున్నారు. ఈనెల 21న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణభారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్​ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ(ఎస్ బీఐటీ కాలేజీ)లో ఈ మెగా జాబ్ మేళాను ఉంటుంది. ఈ జాబ్​మేళాకు సుమారు100కు పైగా వివిధ ప్రముఖ సంస్థలు, కంపెనీలను ఆహ్వానించారు. నాలుగు వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్లాన్​ చేశారు. పదో తరగతి ఫెయిలైన వారి దగ్గర నుంచి డిగ్రీ, పీజీ వరకు చదివిన వారికి కూడా ఉపాధి కల్పించనున్నారు.

ఎంపికైనవారికి రూ.10 వేల నుంచి రూ.80 వేల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉందని పోలీస్​ఆఫీసర్లు చెబుతున్నారు. సాఫ్ట్, కమ్యూనికేషన్​స్కిల్స్​ఉన్నవారికి​ రూ.8వేల నుంచి రూ.లక్ష వరకు కూడా శాలరీ ఆఫర్ చేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఫార్మా, మెడికల్, ఐటీ కంపెనీలతో పాటు బ్యాంకింగ్, సర్వీసెస్, ఎడ్యుకేషన్ రంగాల్లో టెలీ కాలర్స్ నుంచి​మల్టీ నేషనల్ కంపెనీల వరకు ఈ జాబ్​మేళాలో పాల్గొనేలా ఆయా కంపెనీలను ఒప్పించారు. దీని కోసం అర్హులైనవారు ఈనెల18వ తేదీ వరకు జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్ లో అయినా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు ఆయా పోలీస్​స్టేషన్లలో ఉంచామన్నారు.

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగానే..

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగానే ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పోలీస్​ఆఫీసర్లు తెలియజేశారు. గతేడాది పోలీస్​ఉద్యోగాల నియామక సమయంలోనూ వేలాది మంది యువతీ యువకులకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణనిచ్చారు. ఫిజికల్ ట్రైనింగ్ తోపాటు సబ్జెక్ట్​ఎక్స్​పర్టులను తీసుకువచ్చి క్లాసులు కూడా చెప్పించారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ తీసుకున్న వారిలో 300 మందికి పైగా రాత పరీక్షలకు అర్హత సాధించారు. ఆ ప్రోగ్రాం సక్సెస్ కావడంతో ఇప్పుడు మళ్లీ మెగా జాబ్ మేళా నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. దీనిపై నిరుద్యోగుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. 

నిరుద్యోగులను ప్రోత్సహించాలనే...

జిల్లాలోని నిరుద్యోగులను ప్రోత్సహించాలనే ఈ మెగా జాబ్​ మేళాను ఏర్పాటు చేశాం. దీనిలో పాల్గొనేందుకు వంద వరకు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలు రానున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు నాలుగు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అర్హులైనవారు తమ పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తులను స్వయంగా సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్నవారికి మేళాలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

- విష్ణు వారియర్, సీపీ, ఖమ్మం