మేరు కులవృత్తిని ఆదుకోవాలి

మేరు కులవృత్తిని ఆదుకోవాలి

 

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుట్టుపనిపై ఆధారపడి జీవిస్తున్న మేరు కులస్తులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మేర సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా మంది తమ కులవృత్తికి దూరమైపోతున్నా రని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో తెలంగాణ మేరు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్ మునిగాల రాము అధ్యక్షతన నిరసన దీక్ష చేపట్టారు.

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, రాష్ట్ర అధ్య క్షుడు ఆలె భాస్కర్, ఎంపీ ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వీరశైవ లింగాయత్ సంఘం అధ్యక్షుడు ఈశ్వరప్ప హాజరై వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో కుట్టుపనిపై ఆధారపడి బతుకుతున్న మేరు కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఐదు లక్షల ఇన్సూరెన్స్ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. 50 ఏండ్లు దాటినవారికి పెన్షన్ ఇవ్వాలని, మేరు ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

ఇతర కులాలకు ఇస్తున్న విధంగా మేరు కులవృత్తిదారుల టైలర్ షాపులకు ఉచిత  విద్యుత్ అందించాలన్నారు. నిరసనలో జేఏసీ ప్రతి నిధులు సింగు విష్ణు, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.