అర్ధరాత్రి ప్రయాణం.. ప్రాణాలకే ప్రమాదం

అర్ధరాత్రి ప్రయాణం.. ప్రాణాలకే ప్రమాదం
  • రాత్రివేళల్లోనే ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్లు 
  •     నిద్రమత్తులో అదుపు తప్పుతున్న వాహనాలు 
  •     తెల్లవారుజామున డ్రైవింగ్​ మరింత డేంజర్​ 

మంచిర్యాల, వెలుగు: నిద్రమత్తు, ఓవర్​ స్పీడ్,  డ్రంకన్​డ్రైవ్ వంటి కారణాల వల్ల ఘోర ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. వాహనదారులు, డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండడం వల్ల వెహికల్స్​ అదుపు తప్పడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రోడ్లపై ట్రాఫిక్​ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో నైట్ టైమ్​లో జర్నీలు చేస్తున్నారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత లాంగ్​ జర్నీ చేయడం వల్ల డ్రైవర్లు అలసిపోయి నిద్రమత్తులోకి జారుకోవడంతో స్టీరింగ్​పై కంట్రోల్​ తప్పుతున్నారు. 

దీంతో వాహనాలు డివైడర్లను, రోడ్డు పక్కనున్న కల్వర్టులను లేదా ఎదురుగా వస్తున్న వాహనాలను  ఢీకొడుతున్నారు. దీంతో వాహనాల్లో ప్రయాణిస్తున్నవారి నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4.30 గంటల మధ్య జర్నీ మరింత డేంజర్​ అని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కాళ్లు, చేతులు విరిగిపోయి వైకల్యం బారిన పడుతున్నారు. ఇతర శరీర భాగాలు దెబ్బతిని బాధితులు మంచానికే పరిమితమవుతున్నారు. అలాంటి వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది.  

హైవేలపైనే అధికం..

నైట్​ జర్నీల కారణంగా హైవేలపైనే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా మీదుగా ఎన్​హెచ్​ 44, ఎన్​హెచ్​ 63, ఎన్​హెచ్​ 363తో పాటు హైదరాబాద్​ టూ మంచిర్యాల రాజీవ్​ రహదారి నిత్యం యాక్సిడెంట్లతో నెత్తురోడుతున్నాయి. ఆసిఫాబాద్​, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్​ జిల్లాల నుంచి రోజూ వేలాది మంది వివిధ పనులకు హైదరాబాద్​వెళ్తుంటారు. చాలామంది సెల్ప్​ డ్రైవింగ్​ చేస్తూ ఉదయమే బయల్దేరి మధ్యాహ్నం హైదరాబాద్​ రీచ్​ అవుతారు. 

అక్కడ సాయంత్రం వరకు పనులు చూసుకొని నైట్​ డిన్నర్​ అనంతరం రిటర్న్​ జర్నీ స్టార్ట్​ చేసి తెల్లవారుజామున గమ్యం చేరుకుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రమత్తు ముంచుకొస్తున్నా ఆగకుండా డ్రైవింగ్​ చేయడం వల్ల ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసులు 'అరైవ్​... అలైవ్​' ప్రోగ్రాం ద్వారా ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు.  

మరికొన్ని ఘటనలు..

  •   ఇటీవల మహారాష్ర్టలోని చంద్రాపూర్​ జిల్లాకు చెందిన వలస కూలీలు బొలెరోలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​కు వరినాట్ల కోసం వెళ్తూ తెల్లవారుజామున 3 గంటలకు మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్​ రోడ్డు దగ్గర రోడ్డు పక్కన ఆగారు. వెనుకనుంచి స్పీడ్​గా వచ్చిన లారీ డ్రైవర్​ నిద్రమత్తు వల్ల అదుపుతప్పి బొలెరోను ఢీకొన్నది. ఈ ఘటనలో ముగ్గురు వలస కూలీలు మృతిచెందారు. 
  •   ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడ గ్రామ సమీపంలో గతేడాది డిసెంబర్ 10న అర్ధరాత్రి కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొన్నది. అందులో ప్రయాణిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్పాట్​లోనే చనిపోయారు. 
  •   మంచిర్యాల జిల్లాలో 2024లో 402 యాక్సిడెంట్లు జరిగాయి. ఇందులో 123 మంది చనిపోగా, 289 మంది గాయపడ్డారు. 2025లో 429 యాక్సిడెంట్లలో 132 మంది ప్రాణాలు కోల్పోగా, 170 మందికి గాయాలయ్యాయి.  

మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజీ రోడ్​కు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు ఈ నెల 15న హైదరాబాద్​లో బంధువుల ఇంటికి వెళ్లారు. 17న రాత్రి తిరిగి వస్తూ కరీంనగర్​లో ఎంబీబీఎస్​ చదువుతున్న కూతురును కాలేజీలో డ్రాప్​ చేశారు. అక్కడినుంచి బయల్దేరి వస్తుండగా బసంత్​నగర్​ బస్టాండ్​ దాటిన తర్వాత కారు అదుపు తప్పి రాజీవ్​ రహదారిపై కల్వర్టును ఢీకొన్నది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్, రజిత స్పాట్​లోనే చనిపోయారు. ఈ ప్రమాదం గత మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఇలా అర్దరాత్రి ప్రయాణాలు తరచూ యాక్సిడెంట్లకు దారితీస్తూ ప్రాణసంకటంగా మారుతున్నాయి. 

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు..

డ్రైవర్లకు నిద్రమత్తు ఆవరిస్తే వెహికల్​ను పక్కకు ఆపి కాసేపు రెస్ట్​ తీసుకోవాలి. నైట్​లో ట్రాఫిక్​ లేకపోవడంతో రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఓవర్​ స్పీడ్​ వెళ్లకూడదు. మద్యం తాగి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరం. వెహికల్​ లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. లాంగ్​ జర్నీల్లో ప్రతీ గంటర్నర, రెండు గంటలకు ఓసారి ఐదు పది నిమిషాలు ఆగాలి. ఫేస్ వాష్ అండ్ గో'విధానం పాటించాలి. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్​ కచ్చితంగా పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు. అత్యవసరమైతే తప్ప నైట్​ జర్నీలు చేయకపోవడమే మంచిది.