ట్యాంకర్లకు ట్యాంకర్ల పాలు మురికి కాలువలో పారబోశారు.. ఇవి గానీ తాగితే మనిషి ప్రాణాలతో ఉంటాడా..?

ట్యాంకర్లకు ట్యాంకర్ల పాలు మురికి కాలువలో పారబోశారు.. ఇవి గానీ తాగితే మనిషి ప్రాణాలతో ఉంటాడా..?

పాలు.. బలవర్ధక ఆహారం మాత్రమే కాదు లక్షలాది మంది పిల్లలు, తల్లులు, రోగులు, వృద్ధులకు పోషకాహారం. ఎవరైనా అనారోగ్యానికి గురై అన్నం తినలేని పరిస్థితి ఉంటే.. పాలు, బ్రెడ్ తినమంటారు. అలాంటి పాలను కూడా కల్తీ చేసి పాపాలకు ఒడిగడుతున్నారు. కోట్ల రూపాయల దందాగా మార్చుకుంటున్నారు. ఎవరి ఆరోగ్యం ఎలా పోతే మాకేంటని పాలతో పాపాలు చేస్తున్నారు.

మహారాష్ట్రలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) పుణె విభాగం ఏడు ప్రాంతాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ.37.61 లక్షల విలువైన ఆహార నిల్వలను స్వాధీనం చేసుకుంది. వీటిల్లో ఎక్కువగా పాల కల్తీ ఉత్పత్తులే ఉండటం శోచనీయం. పుణె సంగోలా (సోలాపూర్)లోని అజింక్యరణ మిల్క్ ఇండస్ట్రీస్ నుంచి పాలను రవాణా చేస్తున్న ఒక పాల ట్యాంకర్‌ను (MH 12 VB 4700) FDA అధికారులు అడ్డగించారు. కల్తీ అనుమానంతో రూ. 11.39 లక్షల విలువైన 28 వేల 498 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ పాలు త్వరగా పాడైపోయేవి కావడంతో, వాటిని పారబోశారు.

పుణె అహల్యానగర్‌లోని అంబిల్‌వాడిలో గల ప్రియదర్శిని పాల సేకరణ కేంద్రం నుంచి పాలను రవాణా చేస్తున్న మరో పాల ట్యాంకర్‌ను (MH 16 CC 5001) తనిఖీ చేశారు. నమూనాలను సేకరించిన అనంతరం, అధికారులు ₹9.79 లక్షల విలువైన 24 వేల 498 లీటర్ల పాలను స్వాధీనం చేసుకుని పారబోశారు. FDA అధికారులు జున్నార్‌లోని యశోద మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్‌ను తనిఖీ చేసి, ఏ2 గిర్ ఆవు పాలు (డీకే బ్రాండ్), సాధారణ ఆవు పాల నమూనాలను సేకరించారు.

కల్తీ మరియు లేబులింగ్ ఉల్లంఘనల అనుమానంతో రూ.81 వేల 270 విలువైన 18 వందల ఆరు లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆ యూనిట్‌ను ఆదేశించారు.

►ALSO READ | అమ్మాయిల పెళ్లి వయసు 18 కాదు 21... త్వరలోనే చట్ట సవరణకు కేంద్రం ప్లాన్...!

సోలాపూర్ సాంగోలాలోని అజింక్యరణ మిల్క్ ఇండస్ట్రీస్‌లో FDA అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పాల నమూనాలను సేకరించి.. రూ.15.01 లక్షల విలువైన 37 వేల 532 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. పాలను పారబోసి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.

ఐఏఎస్ అధికారి తుకారాం ముండే FDA కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి FDA తనిఖీలు ముమ్మరం కావడం గమనార్హం. కల్తీ బ్యాచ్ పీచమణచడమే లక్ష్యంగా తుకారాం ముండే ముందుకెళుతున్నారు. FDA తనిఖీలను తప్పించుకోవడానికి పాలను ట్యాంకర్ల నుంచి మురుగు కాలువల్లో పారబోస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.