గడువులోపు ‘సీఎంఆర్’ సాధ్యమేనా! .. గతేడాది ఖరీఫ్​ బియ్యం ఇచ్చేందుకు  రెండు వారాల గడువు

గడువులోపు ‘సీఎంఆర్’ సాధ్యమేనా! .. గతేడాది ఖరీఫ్​ బియ్యం ఇచ్చేందుకు  రెండు వారాల గడువు
  • ఖమ్మం జిల్లాలో 18,513, భద్రాద్రి జిల్లాలో 3,077 టన్నులు పెండింగ్

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కస్టమ్ ​మిల్లింగ్ రైస్​ (సీఎంఆర్​)ను అప్పగించేందుకు అధికారులకు మిల్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. గడువులోగా అందించడం సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతేడాది వానాకాలం (ఖరీఫ్) సీజన్​ కు సంబంధించిన సీఎంఆర్​ ఇప్పటి వరకు అప్పగించలేదు. నిబంధనల ప్రకారం ఖరీఫ్​ మార్కెటింగ్ సీజన్​(కేఎంఎస్​) సెప్టెంబర్​ 30తోనే ముగిసింది. అప్పటికి ఇంకా 100 శాతం సీఎంఆర్​ రాకపోవడంతో చివరి అవకాశంగా ప్రభుత్వం గడువు పెంచింది.

డిసెంబర్ 31లోపు బియ్యం అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 96.24 శాతం పూర్తి కాగా, ఖమ్మం జిల్లాలో ​90 శాతం పూర్తయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంకా 3,077 మెట్రిక్​ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో ఇంకా 18,513 మెట్రిక్​ టన్నులు పెండింగ్ ఉందని అధికారులు చెబుతున్నారు. గడువు కంటే ముందుగా సీఎంఆర్​ పూర్తిగా అందజేసిన వారికే ఈ సీజన్​ లో మళ్లీ ధాన్యం కేటాయిస్తామని ఆఫీసర్లు  సమావేశాలల్లో పదేపదే చెబుతున్నా మిల్లర్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పర్యవేక్షణ లోపంతోనే డిలే..?

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్​ ఆలస్యానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్, జులై వరకు వేగంగా జరిగిన సీఎంఆర్​ రికవరీ..  ఆ తర్వాత నత్తనడకను సాగుతోంది. మొన్నటి వరకు అధికారులు, సిబ్బంది అంతా ఎలక్షన్​ డ్యూటీల్లో ఉండడంతో మిల్లర్లు కూడా లైట్ తీసుకున్నారు. ఇక సివిల్ సప్లయ్స్ ​మేనేజర్​కు జిల్లా సివిల్​సప్లయ్స్​ఆఫీసర్​ (డీఎస్వో) గా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో ఇద్దరి పనులను ఒక్కరే చేయాల్సి వస్తోంది. ఆర్నెళ్లుగా రెగ్యులర్​ డీఎస్వో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.  

మిల్లర్ల వద్ద అసలు ధాన్యం ఉందా? లేదా?

ఖమ్మం జిల్లాలో గతేడాది ఖరీఫ్ సీజన్​ కు సంబంధించి 7 పారా బాయిల్డ్, 57 రా రైస్​ మిల్లులకు 2,72,593 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు ఇచ్చారు. మొత్తం 1,82,637 మెట్రిక్​ టన్నుల బియ్యం సప్లయ్​ చేయాల్సి ఉండగా, 1,64,123 మెట్రిక్​ టన్నులను సివిల్ సప్లయ్స్​ కు, ఎఫ్సీఐ గోడౌన్లకు రవాణా చేశారు. అయితే మిగిలిన బియ్యం ఇచ్చేందుకు మిల్లర్ల దగ్గర అసలు ధాన్యం ఉందా?  లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ క్రమంలోనే ఇటీవల ఆఫీసర్లు కొన్ని మిల్లులను విజిట్ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించారు. 

రబీకి సీఎంఆర్​ 4.2 శాతమే.. 

గతేడాది ఖరీఫ్​కు సంబంధించిన సీఎంఆర్​ ఇప్పటికీ పెండింగ్ ఉండగా, గతేడాది రబీకి సంబంధించిన సీఎంఆర్​ రికవరీకి కూడా ప్రభుత్వం ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది రబీ సీజన్​ కు సంబంధించి 25,016 మెట్రిక్​ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా శుక్రవారం వరకు కేవలం 4,019 టన్నుల బియ్యం మాత్రమే తిరిగిచ్చారు. మొత్తం సీఎంఆర్​ లో ఇది 16 శాతం మాత్రమే. ఇంకా 20,996 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ ఇవ్వాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో 66,950 మెట్రిక్​ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2,842 మెట్రటిక్​టన్నులు(4.2 శాతం) మాత్రమే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇంకా 64,108 మెట్రిక్​ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. మరో రెండు వారాల్లో రబీ సీఎంఆర్​ లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యమనే తెలుస్తోంది.

ఖరీఫ్​ సీఎంఆర్​  90 శాతం పూర్తయింది

ఖమ్మం జిల్లాలో గతేడాది ఖరీఫ్​ కు సంబంధించి 90 శాతం సీఎంఆర్​ పూర్తయింది. పెండింగ్ ఉన్న మిల్లర్లతో రెగ్యులర్​ గా మాట్లాడుతున్నాం. ఇంకా 18,513 మెట్రిక్​ టన్నులు పెండింగ్ ఉంది. వాటిని గడువులోగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

 శ్రీలత, సివిల్ సప్లయ్స్​ జిల్లా ఆఫీసర్​