- రోడ్డు సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తం
- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: కొత్త సంవత్సరంలో రోడ్డు సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించినప్పుడే యాక్సిడెంట్లు తగ్గుతాయన్నారు. గురువారం ఖైరతాబాద్లోని రవాణా శాఖ ఆఫీస్లో ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేశారు. తరువాత తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్, ఆర్టీసీ మంత్లీ మ్యాగజైన్ విడుదల చేసి మాట్లాడారు. దేశంలో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ను నంబర్ వన్ స్థానంలో నిలపాలన్నారు. అందుకు రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సులు ఎక్కువ నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ తనకు తండ్రిలాంటి వారని, ఆయన ఆకాంక్షించిన విధంగా బంగారు తెలంగాణలో ఆర్టీసీ, రవాణా శాఖలను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే తన కల అని చెప్పారు. టీఎస్ ఆర్టీసీ, రవాణా శాఖ తనకు రెండు కళ్లలాంటివన్నారు. ఆర్టీఏలో ఏజెంట్లు లేకుండా, పూర్తి ట్రాన్స్పరెంట్గా సర్వీస్ అందించేలా సిస్టం తీసుకురావాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఈ ఏడాది సంస్థను లాభాల బాటలో నడిపించి బోనస్ పొందాలన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు పురుషోత్తంనాయక్, టీవీరావు, జేటీసీలు పాండురంగానాయక్, రమేష్, మమతాప్రసాద్, డీటీసీ పాపారావు, పుప్పాల శ్రీనివాస్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.