- మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
- నిమ్స్లో ల్యాబ్స్ ప్రారంభం
పంజాగుట్ట/హైదరాబాద్, వెలుగు : వైద్యసేవల్లో నిమ్స్ఆస్పత్రి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. నిమ్స్ బ్రాండ్ కొనసాగేలా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని హెల్త్ డెస్టినేషన్గా మార్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. శుక్రవారం ఆయన నిమ్స్లో డీఎస్ఏ ల్యాబ్, సీపీఆర్ స్కిల్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డీఎస్ఏ ల్యాబ్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.12 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
యూఎస్ ఎయిడ్ ద్వారా సమకూరిన రూ. 5 కోట్లతో సీపీఆర్ స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. ఐసీ యూ వార్డ్ ఆధునీకరణ పనులకు రూ. 2 కోట్లు ఖర్చు అయ్యాయని వివరించారు. మొత్తం 19 కోట్లతో నిమ్స్ లో పలు అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఆస్పత్రి పాటు నిమ్స్ ఆస్పత్రి ప్రజలకు నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నదని తెలిపారు.
రాష్ట్రాన్ని హెల్త్ డెస్టినేషన్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు రావడానికి డాక్టర్లు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో రాష్ట్రాన్ని మెడికల్ టూరిజంతో పాటు హెల్త్ ఎడ్యుకేషన్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తామని దామోదర పేర్కొన్నారు.
300 మందికి అపాయింట్మెంట్ లెటర్స్
వెల్నెస్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కాంట్రాక్ట్పద్ధతిలో 300 మంది స్టాఫ్ నర్సులు, 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి దామోదర నియామక ఉత్తర్వులు అందజేశారు. నిమ్స్లో మరిన్ని నియామకాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప, డీన్ లీజ రాజశేఖర్, డాక్టర్ పరంజ్యోతి, డాక్టర్ సాయి సతీశ్, సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
