వైద్య విద్యను నాసిరకంగా మార్చి.. ఇప్పుడు దొంగ ఏడుపులా : మంత్రి దామోదర రాజనర్సింహ

వైద్య విద్యను నాసిరకంగా మార్చి.. ఇప్పుడు దొంగ ఏడుపులా : మంత్రి దామోదర రాజనర్సింహ
  • హరీశ్ రావుపై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్​
  • ప్రతి మెడికల్ కాలేజీని కాపాడుకుంటమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: వైద్య విద్యను నాసిరకంగా మార్చి, ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని బీఆర్‌‌‌‌ఎస్ నేత హరీశ్‌‌‌‌రావుపై వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ‘‘మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమంటే పేపర్ల మీద జీవోలు ఇచ్చుడు కాదు అని, కాలేజీకి బిల్డింగుండాలె, ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా హాస్పిటల్ ఉండాలె, ఫ్యాకల్టీ ఉండాలె, హాస్పిటల్‌‌‌‌లో, కాలేజీలో ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలె, విద్యార్థులకు హాస్టల్స్ ఉండాలె ఇలా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తేనే కాలేజీ ఏర్పాటు చేసినట్టు’’ అని మంత్రి దామోదర సోమవారం ట్వీట్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాగితాలపై కాలేజీలను చూపించి, వైద్య విద్యను గత ప్రభుత్వం నాసిరకంగా మార్చిందని ఆరోపించారు. 

సరైన ప్లాన్ లేకుండా, ఫ్యాకల్టీని నియమించకుండా, బిల్డింగులు కట్టకుండా, మౌలిక వసతులు కల్పించకుండా మెడికోల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టారన్నారు. ఇప్పుడు కాలేజీలకు ఎన్‌‌‌‌ఎంసీ నోటీసులు రాగానే దొంగ ఏడుపులు ఏడుస్తూ, పిల్లలను తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసేలా ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో నోటీసులే రానట్టుగా, నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 ‘‘మీరు నాశనం చేసిన ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థను గాడిలో పెడుతున్నం. ఏడాదిన్నరలో హెల్త్ డిపార్ట్ మెంట్​లో 8 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రతి కాలేజీకి, హాస్పిటల్‌‌‌‌కు బిల్డింగులను అందుబాటులోకి తీసుకొస్తున్నం. మౌలిక వసతులు కల్పిస్తూ ముందుకెళ్తున్నం’’ అని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి కాలేజీని కాపాడుకుంటామని, ఒక్క సీటు కూడా పోకుండా చర్యలు తీసుకునే బాధ్యత మా ప్రభుత్వానిదని మంత్రి భరోసానిచ్చారు.