
- రక్తహీన రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
- రిటైర్మెంట్ బెనిఫిట్ గా అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష
- అంగన్వాడీ స్కూల్స్ అన్నీ ప్రీ ప్రైమరీ స్కూల్సే
- ఇందిరమ్మ అమృతం స్కీం లాంచ్ చేసిన మంత్రి సీతక్క
భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ/ భద్రాచలం, వెలుగు: త్వరలోనే అంగన్వాడీ టీచర్లు, ఆశాలకు జీతాలను పెంచనున్నట్టు మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. కొత్తగూడెంలో గురువారం ఇందిరమ్మ అమృతం స్కీంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదట ఇందిరమ్మ అమృతం స్కీమ్ను ప్రారంభిస్తున్నామని, కుమ్రభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపలపల్లి జిల్లాల్లో కూడా ఈ స్కీమ్ను అమలు చేస్తామన్నారు. మూడు జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న 14 నుంచి 18 ఏండ్ల వయసున్న 50,269 మంది బాలికలకు ఈ స్కీం ద్వారా లబ్ది కలుగుతుందని, ఒక్కో బాలికకు నెలకు రెండు అమృతం పాకెట్లు ఇస్తామని తెలిపారు.
రాష్ట్రాన్ని రక్తహీన రహిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం స్కీంను తీసుకువచ్చిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చామని, సెంటర్లలో సరుకులు పక్కదారి పట్టిస్తే సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్కు రూ.2 లక్షలు, ఆయాకు రూ. లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు అనుమతిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం సంతకం చేశారని తెలిపారు.
తల్లిదండ్రులు లేని పిల్లలకు మిషన్ వ్యాత్సల్య స్కీంలో భాగంగా నెలకు రూ. 4 వేలు ఇస్తున్నట్టు చెప్పిన ఆమె, జిల్లాకు మంజూరైన రూ. 74.64 లక్షల చెక్కును అందజేశారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐటీడీఏ పీవో రాహూల్ పాల్గొన్నారు. పాత కొత్తగూడెం నుంచి పెనుబల్లి వెళ్లే దారిలో వాగుపై హై లెవెల్ బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఏదో ఒక పేరుతో ఆదివాసీలను హతమారుస్తున్న బీజేపీ సర్కార్
ఏదో ఒక పేరుతో ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం హత మారుస్తోందని సీతక్క ఆరోపించారు. పాల్వంచ మండలం కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆదివాసీ విలేజ్ మీట్ ను ఆమె ప్రారంభించారు. విలువైన మైనింగ్ సంపదను అదాని, అంబానీలకు దోచిపెట్టేందుకే ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందన్నారు. ఆదివాసీలను హతమారుస్తూ వారి శవాలను కూడా కుటుంబసభ్యులకు ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తోందని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే విక్రాంత్ బూరియా, ఏఐసీసీ సభ్యుడు రాహుల్ బుజ్జ, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే లు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య పాల్గొన్నారు.
నిర్వహణకు కసరత్తు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. భద్రాచలం సీతారాముడిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రామ పరిపాలన కుంటు పడకుండా.. ఎన్నికల నిర్వహణ కోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రామాలయంలో సీతక్కకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. పూజలు చేసిన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదాశీర్వచనం ఇచ్చారు.