కాంగ్రెస్‍ మీద కక్ష సాధించాలనే రాజకీయాల్లోకి వచ్చా : ఎర్రబెల్లి

కాంగ్రెస్‍ మీద కక్ష సాధించాలనే  రాజకీయాల్లోకి వచ్చా : ఎర్రబెల్లి
  • కేసీఆర్‌ తర్వాత నేనే సీనియర్‌
  • కాంగ్రెస్‍ మీద కక్ష సాధించాలనే  రాజకీయాల్లోకి వచ్చా
  • ఆ పార్టీని నాశనం చేయాలనే టీడీపీలో చేరా
  • పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు

వరంగల్‍, వెలుగు: ‘తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‍ తర్వాత నేనే సీనియర్‍ని. నా అంత సీనియర్‍ ఎవ్వల్లేరు. వరుసగా 30 ఏండ్లనుంచి గెలుచుకుంటూ వస్తున్నా’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. ఆదివారం వరంగల్‍ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం జడ్పీహెచ్‍ఎస్‍ స్కూల్​లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కసికొద్దే పాలిటిక్స్​లో రాణించినట్లు చెప్పారు. అప్పట్లో ఎమ్మెల్యే కంటే పెద్ద పదవిగా భావించే ‘సమితి ప్రెసిడెంట్‍’గా తన తండ్రి పోటీ చేస్తే కాంగ్రెస్‍ టికెట్​ఇచ్చినట్టే ఇచ్చి మరో వర్గంతో ఓడగొట్టిందన్నారు. అలాంటి పార్టీ మీద వ్యతిరేకతతో కక్ష సాధించాలనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‍ పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఎన్‍టీఆర్‍ ఆధ్వర్యంలోని టీడీపీలో చేరినట్లు చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్‍ పార్టీని ఓడించినట్లు చెప్పారు. కసి ఉండడం వల్లే ఎన్నికల్లో ఏడుసార్లు గెలిచానని..ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఇంకోసారి ఎంపీగా విజయం సాధించినట్లు చెప్పారు. అప్పట్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు ఉండేవని.. వాలీబాల్‍, స్విమ్మింగ్‍, కబడ్డీ ఇలా మొత్తం ఫస్ట్​ ప్రైజ్‍లు తనకే వచ్చేవన్నారు. గడిచిన 10 ఏండ్లుగా పోటీలు బందయ్యాయన్నారు.