- జనమంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నరు
- ఏడాదికో పార్టీ మారే రేవంత్.. కేటీఆర్ను విమర్శిస్తడా?
- 16న జనగామ సభను సక్సెస్ చేయాలని మంత్రి పిలుపు
జనగామ, వెలుగు: రేవంత్రెడ్డి.. ఓ బ్రోకర్, చీటర్, బ్లాక్మెయిలర్ అని, పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైరయ్యారు. శనివారం జనగామలోని బీఆర్ఎస్ ఆఫీస్లో పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్నాయకత్వంలో కాంగ్రెస్పార్టీ అట్టర్ఫ్లాప్ కావడం ఖాయమన్నారు. ఏడాదికో పార్టీ మారే రేవంత్.. కేటీఆర్ను విమర్శించడం సిగ్గుచేటన్నారు.
రేవంత్రెడ్డి మొదట్లో గోడల మీద రాతలు రాసే పెయింటర్ అని, ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్నడిపాడని, ఆయన బతుకు అందరికీ తెలుసన్నారు. కొడంగల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తే రంగారెడ్డి జిల్లాపై పడ్డాడని, దమ్ముంటే ఇప్పుడు గెలవాలని సవాల్ విసిరారు. తెలంగాణ జనం కేసీఆర్ను గుండెల్లో పెట్టుకున్నారని, 15న ప్రకటించేమేనిఫెస్టోతో ఆయనకు మరింత మద్దతు పెరుగుతుందన్నారు.
రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు. 16న జనగామలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లోకి వస్తానంటే స్వాగతిస్తామన్నారు. 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన బీసీ నేత పార్టీ మారితే.. రేవంత్స్పందించిన తీరు దారుణంగా ఉందన్నారు.
కేసీఆర్ సభ ఏర్పాట్లు ముమ్మరం: పల్లా
జనగామ– సిద్దిపేట రోడ్డులోని మెడికల్కాలేజీ గ్రౌండ్స్లో 16న నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్టు పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు సభా ప్రాంగణానికి సీఎం చేరుకుంటారని, ఘనస్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం మంత్రి దయాకర్ రావుతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున లింగయ్య తదితరులు వారి వెంట ఉన్నారు.