ధాన్యం విషయంలో ఆందోళన వద్దు : మంత్రి గంగుల

ధాన్యం విషయంలో ఆందోళన వద్దు : మంత్రి గంగుల

గతంలో ఎప్పుడూ లేని విధంగా.. వందేళ్లలో ఇంతటి పంట నష్టం ఎప్పడూ జరగలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. మే 2వ తేదీ మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, దుర్శేడు, గోపాల్ పూర్, చేగుర్తి గ్రామాల్లో అకాల వర్షాలకు జరిగిన పంట నష్టాలను పరిశీలించారు మంత్రి గంగుల. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన తడిచిన ధాన్యాన్ని కొంటామని రైతులకు హామీ ఇచ్చారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన మంత్రి.. అకాల వర్షాలకు గతంలో 10 నుంచి 30 శాతం వరకు మాత్రమే నష్టం జరిగేదని..  కానీ ఈసారి 100కు వంద శాతం పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి గంగుల. పంట నష్టం కలిగిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. సివిల్ సప్లై ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ప్రతి ధాన్యం గింజను కొంటామని హామీ ఇచ్చారు.

తడిచిన ధాన్యం ఆరబెట్టి తెస్తే చాలు.. ఎలాంటి కోతలు లేకుండా కొంటామని స్పష్టం చేశారు గంగుల కమలాకర్. రైతులు ఆధైర్య పడొద్దని చెప్పిన గంగుల.. కొనుగోలు సెంటర్లకు వచ్చిన ధాన్యం విషయంలో ఆందోళన చెందవద్దని చెప్పారు. కొందరి పంట కోయకముందే రాళ్ల వానలకు నేలపాలైందని.. అలాంటి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. తడిసిన ధాన్యంలో తేమ శాతాన్ని సడలించాలని ఎఫ్.సి.ఐ.ని కోరామని.. వాళ్లు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని మంత్రి గంగుల అభిప్రాయం వ్యక్తం చేశారు.