కాసేపట్లో సీబీఐ ముందుకు మంత్రి గంగుల కమలాకర్

కాసేపట్లో సీబీఐ ముందుకు మంత్రి గంగుల కమలాకర్

మంత్రి గంగుల కమలాకర్ కాసేపట్లో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన..మరికాసేపట్లో సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్​ కేసులో సీబీఐ మంత్రిని ప్రశ్నించనుంది. ఇవాళ విచారణకు హాజరుకావాలని అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. 15 రోజుల క్రితం హైదరాబాద్​లో జరిగిన కాపు సమ్మేళనంలో గంగుల కమలాకర్​తో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. మూడు నాలుగేండ్లుగా సీబీఐలో పని చేస్తున్నట్లు చెప్పుకున్నాడు.

మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఫొటోలు దిగాడు. శ్రీనివాస్ ను మూడు రోజుల కింద ఢిల్లీలోని తమిళభవన్ లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించే క్రమంలో ఫోన్ లో మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు ఫొటోలు కనిపించాయి. శ్రీనివాస్ కు వీరితో ఉన్న సంబంధం ఏంటి..? అతనికి ఏమైనా డబ్బులిచ్చారా..? ఎప్పటి నుంచి వీరికి పరిచయం ఉంది? వీళ్లు ఎప్పుడెప్పుడు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి గంగులను ఢిల్లీకి రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది.