టికెట్లు అమ్ముకున్నోళ్లు రాష్ట్రాన్ని అమ్ముకోరా: హరీశ్​రావు

టికెట్లు అమ్ముకున్నోళ్లు రాష్ట్రాన్ని అమ్ముకోరా: హరీశ్​రావు

జోగిపేట, వెలుగు : టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్​పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. మంగళవారం ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్​ కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​తో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్​ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డిని జిల్లా చేయలేదు, తలాపున ఉన్న సింగూర్​ నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు.

ఆందోల్​కాంగ్రెస్​పెద్ద లీడర్​వాళ్లకు, వీళ్లకు టికెట్​ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు  భంగపడ్డారని విమర్శించారు. తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్​ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు.  కేసీఆర్​ను గెలిపించుకుటేనే భవిష్యత్​ ఉంటుందన్నారు. తల్లి లాంటి బీఆర్ఎస్​ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్​, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

ఎంపీ బీబీ పాటిల్​మాట్లాడుతూ.. తెలంగాణలో  ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. కార్యకర్తలందరు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మార్క్​ట్రేడ్​ కార్పొరేషన్​ చైర్మన్​ భిక్షపతి, జడ్పీ చైర్​పర్సన్​ మంజూశ్రీ,  మార్క్​ఫెడ్​ డైరెక్టర్​జగన్మోహన్​రెడ్డి, డీసీసీబీ  డైరెక్టర్​ జైపాల్​రెడ్డి,  సంజీవయ్య, నారాయణ, వెంకటేశం, శ్రీధర్​పాల్గొన్నారు.