రేషన్ షాపుల్లో కంటి వెలుగు టైం టేబుల్ పెట్టాలి : మంత్రి హరీశ్ రావు

రేషన్ షాపుల్లో కంటి వెలుగు టైం టేబుల్ పెట్టాలి : మంత్రి హరీశ్ రావు

రేషన్ షాపుల్లో కంటి వెలుగు టైం టేబుల్ పెట్టాలి
పంచాయతీ ఆఫీసుల్లోనూ ఏర్పాటు చేయాలి: హరీశ్​రావు
మంత్రులు, అధికారులతో సమీక్ష

హైదరాబాద్, వెలుగు : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి టైం టేబుల్​ బోర్డులను ఊర్లు, పట్టణాల్లోని రేషన్​ షాపులు, పంచాయతీ ఆఫీసుల్లో ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమంపై మంగళవారం ఆయన మంత్రులు, సీఎస్​ సోమేశ్ కుమార్, జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కంటి వెలుగు క్యాంపుల వివరాల బుక్​లెట్​ను ఆవిష్కరించారు. పంచాయతీ, మున్సిపల్​ వార్డు కేంద్రంగా రెండో విడత కంటి వెలుగు క్యాంపులను ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరం ఉన్నోళ్లందరికీ కంప్యూటరైజ్డ్​ పరీక్షలు చేస్తామని తెలిపారు.

క్యాంపులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉంటాయని, ఒక్కో క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, 8 మంది సిబ్బంది పనిచేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందని చెప్పారు. 12లోగా అన్ని జిల్లాల్లోనూ మంత్రులు కంటి వెలుగు సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్లాన్​ చేసుకోవాలని, అదనపు బృందాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 1 శాతం బఫర్ టీమ్ (అడ్వాన్స్ టీమ్​)లు పెట్టుకోవాలన్నారు. సిబ్బందికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పీహెచ్​సీల్లో కొత్తగా 929 మంది డాక్టర్లను నియమించామని, ఇతర ఆరోగ్య సేవలకు కంటి వెలుగుతో ఎలాంటి ఆటంకం ఉండబోదని చెప్పారు.