
సిద్దిపేట: దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.. ముఖ్యమంత్రి చదివిన పాఠశాలను రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారన్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి మాట్లాడుతూ.. నిరంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి కృషి చేసిన రామలింగారెడ్డి.. ఈ రోజు మన మధ్యలో లేకపోవడం బాధకరమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని , నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 15 రోజుల్లో లబ్ధిదారులకు అందజేయాలని అధికారులకు సూచించారు.
రామలింగారెడ్డి ఆలోచన మేరకు దుబ్బాకలో లైబ్రరీ నిర్మాణానికి ఒక కోటిరూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు హరీష్ రావు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆశయాలను యధావిధిగా నెరవేరుస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు చెందిన పిల్లకాలువలను వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు మంత్రి హరీష్.