తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందుతున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' ఫైనల్ కి చేరుకుంది. దీంతో హౌస్ లో కంటెస్టెంట్ మధ్య పోటీ తీవ్రమైంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. మొత్తం 99 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, ఇప్పుడు హౌస్లో మిగిలింది కేవలం అయిదుగురు ఫైనలిస్టులు మాత్రమే. వీరిలో విన్నర్ ఎవరు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఫైనలిస్టుల భావోద్వేగాలు
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఇప్పుడు తీవ్రమైన పోటీతో పాటు, తమ అనుభవాలను నెమరువేసుకుంటూ ఎమోషనల్ వాతావరణం నెలకొంది. సోమవారం 99వ రోజున, హౌస్మేట్స్ మధ్య సరదా, హాస్యం, చిన్న చిన్న డ్రామా సన్నివేశాలతో కూడిన ప్రత్యేక టాస్కులను నిర్వహించాడు బిగ్ బాస్ . అయితే, దీనికి మించి, హౌస్మేట్స్ తమ బిగ్ బాస్ జర్నీ అంటే ఏమిటో చెప్పమని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో అందరూ తమ మనసులోని భావాలను వెల్లడిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇమ్మాన్యుయెల్ ఎమోషనల్
ఇమ్మాన్యుయెల్ తన ప్రయాణాన్ని వివరిస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. బయట ఎన్నో కామెడీ షోలు చేశాను. ఇక్కడ కూడా సింపుల్గా నవ్వించేయొచ్చు, ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించవచ్చు అనుకున్నాను. కానీ వచ్చిన మొదటివారమే మర్యాద మనీష్తో కామెడీ విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట ఒక్కవారంలో కూలిపోయిందా? అని నిద్ర కూడా పట్టలేదు అంటూ ఆ నాటి బాధను పంచుకున్నాడు. ఆ సమయంలోనే తల్లిలాంటి సంజనా పరిచయమైందని, తను ఊరికనే ఏడ్చేస్తానని ఇక్కడికి వచ్చాకే తెలిసిందని ఇమ్మాన్యుయెల్ కన్నీరు పెట్టుకున్నాడు.
నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ..
డిమాన్ పవన్ తన కుటుంబం గురించి తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. బిగ్ బాస్ హౌస్కు వచ్చే ముందు కెరీర్లో చాలా స్ట్రగుల్ అవుతున్నాను. అమ్మానాన్నను సరిగా చూసుకోలేకపోతున్నాను. అన్న, నాన్నపై ఆధారపడుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను అంటూ తన ఆర్థిక కష్టాలను గుర్తుచేసుకున్నాడు. తనూజ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ప్రేమను పంచారు. నా జీవితంలో ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను అంటూ ప్రేక్షకుల అభిమానాన్ని గుర్తుచేసుకుంది. కల్యాణ్ బిగ్ బాస్ను కావాలనిపించే కష్టం అని వర్ణించాడు. భోజనం, నిద్ర, మనుషులు ఏదీ కరెక్ట్గా ఉండదు. అయినా ఇది మనకు కావాలనిపిస్తుందిఅంటూ బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాన్ని తెలిపారు.
విన్నర్ ఎవరు?
ఈ వారం భరణి ఎలిమినేషన్తో టాప్ 5 కంటెస్టెంట్లు ఖరారయ్యారు. ప్రస్తుతం హౌస్లో కల్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్, డిమాన్ పవన్, సంజనా గల్రానీ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిలో ఎవరు విన్నర్గా నిలుస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ ఆదివారం డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే విన్నర్ కోసం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్ను, భారీ ప్రైజ్ మనీని గెలుచుకోబోతున్నారు. స్టార్ హీరో ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ గ్రాండ్ ఫినాలే కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ ఐదుగురిలో ప్రేక్షకుల మనసు గెలిచి, టైటిల్ పట్టేసే ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
