పేషెంట్లను అనవసరంగా వేరే ఆస్పత్రులకు రిఫర్ చేయొద్దు: హరీశ్ రావు

పేషెంట్లను అనవసరంగా వేరే ఆస్పత్రులకు రిఫర్ చేయొద్దు: హరీశ్ రావు
  • గాల్ బ్లాడర్ స్టోన్​కు ఈజీ ట్రీట్​మెంట్​పై దృష్టి పెట్టాలి 
  • టీచింగ్​ హాస్పిటళ్ల పనితీరుపై సమీక్షలో మంత్రి సూచన 

హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లోని టీచింగ్​ఆసుపత్రుల్లోనే అన్ని రకాల స్పెషాలిటీ ట్రీట్ మెంట్లు అందించాలని, పేషెంట్లను అనవసరంగా వేరే ఆస్పత్రులకు రిఫర్​ చేయొద్దని అధికారులు, డాక్టర్లకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు సూచించారు. ఆదివారం ఆయన తన ఇంటి నుంచి డీఎంఈ (డైరెక్టరేట్​ఆఫ్​మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోని టీచింగ్​ హాస్పిటళ్ల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈమధ్య కాలంలో గాల్​బ్లాడర్ స్టోన్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, ఆ సమస్యకు మరింత కచ్చితత్వంతో ఈజీగా ట్రీట్​మెంట్​ఇచ్చే పద్ధతులపై గాంధీ, ఉస్మానియా డాక్టర్లు స్టడీ చేయాలని మంత్రి​సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో టిఫా స్కానింగ్​ పరికరాలను ఏర్పాటు చేశామని, గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల పరీక్షలు అందేలా చూడాలని ఆదేశించారు. గర్భిణులకు అవసరం లేకున్నా సిజేరియన్ డెలివరీలు చేయొద్దని, నార్మల్ డెలివరీలను పెంచాలని సూచించారు. ఇన్​ఫెక్షన్​కంట్రోల్ యూనిట్లపై ప్రతి సోమవారం ఆర్ఎంవోలు, సూపరింటెండెంట్లు రివ్యూ చేయాలన్నారు. దవాఖాన్లలో ఇన్​ఫెక్షన్​సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్​చేయాలని, స్టెరిలైజేషన్​లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. 

మందులన్నీ ఆస్పత్రుల్లోనే ఇయ్యాలె.. 

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​చేసే సమయంలో పేషెంట్​కు అన్ని రకాల మందులు ఇవ్వాలని అధికారులను హరీశ్​రావు ఆదేశించారు. ఆసుపత్రుల్లో మూడు నెలలకు సరిపడా మందులు స్టాక్ ఉంచుకోవాలని సూచించారు. ‘‘డాక్టర్లు, నర్సులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎమర్జెన్సీ డిపార్ట్​మెంట్​లోనూ సిబ్బంది అందుబాటులో ఉండాలి. మెడికల్ పరికరాలు పాడైతే గంటలోనే రిపేర్​చేసేలా పీఎంయూ (ప్రోగ్రామ్​ మేనేజ్​మెంట్​యూనిట్​) విధానం తీసుకొచ్చాం. దీన్ని సద్వినియోగం చేసుకొని పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి. అవసరమైతే అన్ని దవాఖాన్లలోనూ రాత్రి టైంలో కూడా రూల్స్​ప్రకారం పోస్టుమార్టం చేయాలి. ప్రతి ఆస్పత్రికి 25 నుంచి 30 మంది సీనియర్​ రెసిడెంట్లను కేటాయించాం” అని చెప్పారు. ఈ సమావేశంలో హెల్త్​సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.