కమలాపూర్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మళ్లీ ఎమ్మెల్యే, మంత్రి కాలేడని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకోవాలని మంత్రి హరీశ్రావు కోరారు. శుక్రవారం కమలాపూర్ మండలం ఉప్పల్, ఉప్పుల పల్లి, భీంపెల్లి గ్రామాల్లో శుక్రవారం గెల్లు ప్రచారం నిర్వహించారు. భీంపెల్లి గ్రామంలో ప్రచారానికి మంత్రి హాజరై మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్కు నీతి జాతీ లేదని ఈటల మాట్లాడుతుండు. అయ్యా.. నీకే నీతి జాతీ లేదు. నిన్ను రాజకీయంగా పెంచి పెద్ద చేసిన సీఎంకు గోరి కడ్తా అంటవా? సీఎం గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. బీజేపీకి నీతి ఉందా? రైతు చట్టాలపై బీజేపీపై దుమ్మెత్తి పోసి ఇప్పుడు అదే పార్టీలో చేరావు. ప్రజలను ఓట్లు అడిగే ముందు సాగు చట్టాలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై ముందు చెప్పు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారంటే అది కేసీఆర్ చలువే. ఇన్ని చేసిన కేసీఆర్కు నీతి జాతీ లేదంటావా”అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఆత్మ గౌరవం అంటూ ఈటల తన బాధను ప్రజలపై రుద్దుతున్నారన్నారు. మన బాధలు తీరాలన్నా, అభివృద్ధి జరగాలన్నా గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని ప్రజలను హరీశ్ కోరారు. కాగా, అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ప్రచారం చేస్తున్నారు. బాల్క సుమన్ కోలాటం ఆడగా, లీడర్లు కొందరు స్టెప్పులేశారు. ఎన్నికల ఆఫీసర్లు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.