
సిద్దిపేట: కరోనా క్రమంలో సర్కార్కే బారా కిలో చావల్ మిలా, బ్యాంకుమే పంద్ర సౌ గిరా క్యా అంటూ లబ్దిదారులను ఆప్యాయంగా పలకరించి అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీష్. ఆదివారం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో సిద్ధిపేట అర్బన్ మండల పరిధిలోని లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్కులను బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేయలేదని, కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే అమలు చేసిందన్నారు.
ఆడబిడ్డ పెళ్లికి ఏ తండ్రికీ భారం కాకూడదని సీఎం కేసీఆర్ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలుపుతూ.., ఈ సంక్షేమ పథకాన్ని పక్కాగా అమలు చేస్తూ లబ్దిదారులకు చెక్కులను అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకునేందుకు సీఏం కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.