
చౌటుప్పల్/మునుగోడు/చండూరు,వెలుగు : దేశంలోనే ఎక్కడా లేని విదంగా 46 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని విద్యుత్ శాఖ మంత్రి గంటకండ్ల జగదీశ్రెడ్డి చెప్పారు. 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్లను బుధవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్, నల్గొండ జిల్లా మునుగోడు, గట్టుప్పల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫ్లోరైడ్ కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడినా గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ కారణంగా ఫ్లోరైడ్ నుంచి ప్రజలకు విమక్తి దొరికిందన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రే స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రైతులు, చేనేత కార్మికులకు మేలు చేయాలన్న లక్ష్యంతోనే రైతు బంధు, రైతుబీమా, చేనేత బీమా పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చౌటుప్పల్లో రాజ్యసభసభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ రాజు, మాజీ ఎమ్మెల్యే పోసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, వైస్చైర్మన్ బత్తుల శ్రీశైలం, దామోదర్రెడ్డి, మునుగోడు, చండూరులో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్శర్మ, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు రవీంద్రరావు, కోటిరెడ్డి, పాల్గొన్నారు.
చౌటుప్పల్లో కౌన్సిలర్ల ఆందోళన
ఆసరా పింఛన్ల పంపిణీ విషయంపై తమకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డితో వాగ్వాదానికి దిగారు. పెన్షన్ల అప్లై కోసం తాము ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించామని, అర్హులైన వారి ఆధార్కార్డు సేకరించి అప్లై చేశామని, అలాంటిది మాకు తెలియకుండా పంపిణీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా బిల్ కలెక్టర్లతో నేరుగా లబ్ధిదారులకు ఫోన్ చేయించి పిలవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి ప్రోగ్రామ్ ఉందని ఉదయం 8 గంటలకు సమాచారం వచ్చిందని, అందుకే సమాచారం ఇవ్వలేకపోయామని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లకు నచ్చజెప్పారు.
సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి
నల్గొండ జిల్లా మునుగోడులో ఈ నెల 20న జరగనున్న టీఆర్ఎస్ సభా స్థలాన్ని బుధవారం మంత్రి జగదీశ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్ల వివరాలను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.