‘ముంపు గ్రామాల బాధితులను ఆదుకుంటాం’

‘ముంపు గ్రామాల బాధితులను ఆదుకుంటాం’

పులిచింతల ముంపు గ్రామాల రైతాంగాన్ని ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. రెండు నెలలుగా ఎడతెరపి లేకుండా  కురుస్తున్న వర్షాలతోటే ఈ సమస్య ఉత్పన్నమైనదని ఆయన పేర్కొన్నారు. పులిచింతల పరివాహక గ్రామలైన వజినేపల్లి,బుగ్గ మాదరం గ్రామాలను గురువారం రాత్రి మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ సందర్శించారు. ముంపుకు గురైన పంట పొలాలను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో వరద తాకిడి ఎక్కువైందన్నారు. దానికి తోడు కృష్ణా ఉప్పొంగి ప్రవహించడంతో పులిచింతల ప్రాజెక్ట్ నుండి విడుదల చేసిన నీళ్లు నదిని విస్తరించి పారడం తో పంటపొలాలు ముంపుకు గురి అయ్యాయని ఆయన తెలిపారు.నదిని వెడల్పు చేయాల్సిన ఆవశ్యకత ను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి తీసుకెడతామని మంత్రి జగదీష్ రెడ్డి రైతాంగానికి హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన భూసేకరణ జరుగాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో ఎదురవుతున్న విద్యుత్ సమస్యను మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుక రాగా శాశ్వత పరిష్కారం కనుగొనాలని విద్యుత్ అధికారులకు అక్కడికక్కడే ఆయన ఆదేశించారు.