ఐటీకి ఎప్పుడైనా దాడులు చేసే అధికారం ఉంది: జగదీష్ రెడ్డి

ఐటీకి ఎప్పుడైనా దాడులు చేసే అధికారం ఉంది: జగదీష్ రెడ్డి

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే మోడీకి వణుకు వస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసినా.. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు అన్నారు. ఐటీ శాఖకు ఎప్పుడైనా దాడులు చేసే అధికారం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో మంత్రులు ఎవరూ పారిపోలేదని.. ఐటీ అధికారులకు సహకరిస్తున్నారని అన్నారు. దాడుల సమయంలో మంత్రులంతా పారదర్శకంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు లాగా టీఆర్ఎస్ వాళ్లు దొంగలు కాదన్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

బ్లాక్ మనీనీ వెనక్కి రప్పిస్తానని చెప్పిన మోడీ.. ఇప్పుడు మాట మార్చారని ఆయన ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే.. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ చెప్పారు. కాని.. ఇప్పుడు 15 లక్షల మంది ఉద్యోగాలు తొలగించారని విమర్శించారు. మోడీ పాలనలో యువత నిరుద్యోగంలో మగ్గిపోతోందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం కాదని.. కేసీఆర్ పాలసీ, మోడీ పాలసీకి మధ్య జరిగిందని అన్నారు. గుజరాత్‭లో మోడీ కేవలం రూ.600 పింఛన్ ఇస్తున్నారని.. తెలంగాణలో కేసీఆర్ రూ.2000 పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలనను టీఆర్ఎస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు.