రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు:మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు:మంత్రి జగదీష్ రెడ్డి

 పేద ప్రజలు, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్  ప్రవేశపెట్టారని  మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్టంలో గులాబీ జెండా  వచ్చింది కాబట్టే కేసీఆర్ ఇన్ని పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. 2014 ముందు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయడానికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేశారని చెప్పారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేదని.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో నీళ్ల కోసం కోట్టుకుంటున్నారని తెలిపారు. 

గుజరాత్ లో ప్రభుత్వ హాస్పిటల్స్, పాఠశాలలు లేవని.. మోడీ మొత్తం ప్రైవేట్ పరం చేసి పేదల నడ్డి విడిచారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.  గుజరాత్ రైతులు కేసీఆర్ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకోవడంతో మోడీకి వణుకు వస్తుందన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రానికి రావలసిన 17వేల కోట్లు ఆపేశారని దుయ్యబట్టారు. తెలంగాణకు అప్పులు ఇవ్వకుండా బ్యాంకులను మోడీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.  ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ.. దాదాపు 2లక్షల ఉద్యోగాలను తీసివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రధాని  మోడీ కుట్రల వల్లనే రాష్టంలో ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాష్టంలో అభివృద్ధి కొనసాగలన్నా.. దేశంలో అభివృద్ధి కావాలన్నా.. మోడీని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దేశంలో విశేష స్పందన వస్తుందని తెలిపారు.  చిట్యాల మున్సిపాలిటీలో 3 కోట్ల నిధులతో నిర్మించబోయే సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి  అభివృద్ధి పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చిట్యాల మున్సిపాలిటీలో ఇప్పటికే 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. నియోజకవర్గానికి రూ.200 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం లక్ష్మీ గార్డెన్ లో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ  బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.