
- రెండ్రోజుల పాటు పర్యటన
- పలు ప్రారంభోత్సవాలు,
- అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గురు, శుక్రవారాలు ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి తెలుసుకోనున్నారు. పలు సూచనలు, సలహాలు అందించనున్నారు. అనంతరం ఆదిలాబాద్ లో రూ.1.40 కోట్లతో నిర్మించిన కామన్ సర్వీస్ సెంటర్ ను మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు.
సాయంత్రం 4 గంటలకు తలమడుగు మండల కేంద్రంలో రూ.1.56 కోట్లతో నిర్మించిన పీహెచ్సీని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.20 గంటలకు బేల మండలంలోని చప్రాలలో రూ.2.30 కోట్లతో చేపట్టనున జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రూ.1.56 కోట్లతో నిర్మించిన బేల పీహెచ్సీని ప్రారంభిస్తారు. అదేరోజు రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పెన్ గంగా గెస్ట్ హౌజ్లో మంత్రులు బస చేయనున్నారు. 27న ఉదయం మావల అర్బన్ పార్కులో వనమహోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 10.45 గంటలకు ఉట్నూర్ చేరుకొని రూ.13.70 కోట్లతో చేపట్టనున్న కమ్యునిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.
అనంతరం ఉట్నూర్ పీఎంఆర్సీ భవన్లో ఆదివాసీలతో మంత్రులు సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్కు బయల్దేరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడం, స్వయం సహాయక సంఘాలకు చెక్కులు అందించే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మొదటిసారి జిల్లాకు వస్తున్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావులకు ఘనంగా స్వాగతం పలికేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.