
- హరిత హోటల్స్ నిర్వాహకులకు మంత్రి జూపల్లి ఆదేశం
- బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్, వెలుగు: టూరిజం ప్లాజా హోటల్స్ లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో మంగళవారం ఉదయం మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్ అంతా కలియతిరుగుతూ ఆహార పదార్థాలు, కిచెన్ ను పరిశీలించారు. అల్పాహారం చేస్తున్న పర్యాటకులు, అతిథులతో మంత్రి మాట్లాడారు. ఆహార నాణ్యత, రుచిపై ఆరా తీశారు.
అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. హరిత హోటల్స్ లో సౌకర్యాలు, ఆహార నాణ్యతపై నిరంతరం పరిశీలన కొనసాగిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యాటకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉందన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతోపాటు పర్యాటకులు, అతిథుల కోసం మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి తెలిపారు.