
- పీవీ ఎక్స్ప్రెస్వే తర్వాతగ్రేటర్లో ఇదే అతి పెద్దది
మేడిపల్లి, వెలుగు: వరంగల్ హైవేలోని ఉప్పల్– నారపల్లి ఫ్లైఓవర్ను వచ్చే దసరా నాటి(2026)కి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కి.మీ. మేర నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. దాదాపు 8 ఏండ్ల కింద ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి, పాత కాంట్రాక్టర్లను మార్చి పనులను వేగవంతం చేశామన్నారు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే వరంగల్హైవేలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. నగరంలో పీవీ ఎక్స్ప్రెస్వే తర్వాత ఉప్పల్– -నారపల్లి ఆరు లైన్ల కారిడారే అతిపెద్దదని చెప్పారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎన్హెచ్ఎస్ఈ ధర్మారెడ్డి, అధికారులు ఉన్నారు.