తెలంగాణలో నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు మంత్రి కొండా సురేఖ. మంగళవారం ( డిసెంబర్ 9 ) తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అనుసంధానం చేస్తూ నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మంత్రి కొండా సురేఖ.
విజన్ 2047 లో భాగంగా ఆలయాల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటం కోసం మాస్టర్ ప్లాన్లను రూపొందిస్తున్నట్లు తెలిపారు.జోగులాంబ, మన్యంకొండ, వికారాబాద్ అనంతగిరి, యాదగిరిగుట్ట, రామప్ప, భద్రాచలం, వేములవాడ, మేడారం, కాళేశ్వరం తదితర ముఖ్యమైన ఆలయాలను కలుపుతూ నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు కొండా సురేఖ.
Also read:- రెండు రోజుల్లో 5 లక్షల 39 వేల 495 కోట్ల పెట్టుబడులు
తక్కువ నిర్మాణాలు, ఎక్కువ అనుభవాలు" అనే సూత్రం ఆధారంగా తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ సంస్థ నోడల్ ఏజెన్సీతో 2025-30 పర్యాటక విధానం కింద కొత్త ఎకో టూరిజం పాలసీని ప్రకటించారు కొండా సురేఖ. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ఎకో-టూరిజం సర్క్యూట్లు ఉన్నాయని, ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి "డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్" అనే కొత్త బ్రాండ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఇప్పుడు 36 పులులు ఉన్నాయని, 2024లో నుంచి వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. నందిపేట్, తడ్వాయి, పాఖల్ వంటి కొత్త డెస్టినేషన్స్ లో ట్రెక్కింగ్ రూట్స్, టూరిస్టులకు వసతి సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి కొండా సురేఖ.

