బోనాల జాతర ఏర్పాట్లు కంప్లీట్ చేయండి : మంత్రి కొండా సురేఖ

బోనాల జాతర ఏర్పాట్లు కంప్లీట్ చేయండి : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: ఆషాఢ మాసం బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జులై 5లోగా బోనాల జాతర ఏర్పాట్ల పనులు కంప్లీట్ చేయాలన్నారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై బేగంపేట హరిత ప్లాజాలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘బోనాల పండుగ నిర్వహణలో జీహెచ్​ఎంసీది కీలక పాత్ర. శానిటేషన్, ఫాగింగ్, పార్కింగ్ స్థలాలు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. పోలీసులు నిరంతర నిఘా పెట్టాలి. లా అండ్ ఆర్డర్​ను పకడ్బందీగా అమలు చేయాలి. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలి’’అని సూచించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్యాత్మిక, భక్తి సంబంధమైన ప్రోగ్రామ్​లు టెలికాస్ట్ చేసేందుకు స్పెషల్ చానెల్ తెచ్చేలా ప్రయత్నాలు చేయాలని దేవాదాయ శాఖను మంత్రి సురేఖ ఆదేశించారు. బోనాల నేపథ్యంలో మెట్రో అదనపు సర్వీసులు నడపాలని, రాత్రి వేళల్లో సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

 సంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా జానపద కళాకారులకు తగిన అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని ఆదేశించారు. ఫ్రీ బస్సు సౌకర్యాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తావిస్తూ.. ‘‘మగవాళ్లకు బస్సుల్లో సీట్లే దొరకడం లేదు. ఇక విమానాలు కూడా విడిచిపెట్టరా’’అని పొన్నం నవ్వుతూ ప్రశ్నించగానే.. స్పందించిన మంత్రి సురేఖ.. ‘తగ్గేదే లే’ అని అనడంతో సమావేశంలో ఉన్నవారందరూ ఒక్కసారిగా నవ్వారు. రివ్యూ మీటింగ్​లో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ రవిగుప్తా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, జీహెచ్​ఎంసీ కమిషనర్ అమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.