
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. తనను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఇద్దరికి రూ.లక్ష చొప్పున ఫైన్ విధించారు. ఇల్లెందు మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు కట్టించినందుకు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్రావుకు, ఖమ్మం పట్టణంలో ఫ్లెక్సీలు కట్టిన 16వ డివిజన్ కార్పొరేటర్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కె.మురళికి ఈ ఫైన్ వేశారు. ఫ్లెక్సీలు పెడితే లీడర్లు కారని, ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మంత్రి కేటీఆర్ సోమవారం ఖమ్మం పట్టణం, ఇల్లెందుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. ఫ్లెక్సీలు కట్టవద్దని చెప్పినా నాయకులు వినడం లేదన్నారు. పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. పల్లెలు, పట్టణాలు బాగుపడాలనే లక్ష్యంతో ప్రతి నెలా రూ.487 కోట్లను వాటి ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఎంపీలు పలుమార్లు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, అయినా పట్టించుకోవడం లేదని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, మాలోతు కవిత తదితరులు
పాల్గొన్నారు.