
హైదరాబాద్, వెలుగు: పర్యావరణ అనుకూల బిల్డింగ్స్ను ఎంకరేజ్ చేయడానికి సీఐఐకి చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రీన్ ప్రాపర్టీ షోను శుక్రవారం ప్రారంభించింది. ఇది ఈ నెల 30న ముగుస్తుంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ షోను ప్రారంభించారు. ఐజీబీసీ సర్టిఫైడ్ లేదా ప్రీ-సర్టిఫైడ్ గ్రీన్ ప్రాజెక్ట్లు, టెక్నాలజీలను, సేవలను అందించడానికి, గ్రీన్ బిల్డింగ్స్పై కొనుగోలుదారులకు అవగాహన కల్పించడానికి ఈ షో ఏర్పాటు చేశారు. గ్రీన్ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్, బిల్డింగ్, ప్రొడక్ట్స్, సర్వీస్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. 75 మందికిపైగా ఎగ్జిబిటర్లు, ప్రాపర్టీ డెవలపర్లు, సంబంధిత ప్రొడక్టుల తయారీదారులు, కొనుగోలుదారులు, పర్యావరణ అనుకూల డెవలపర్లు, పర్యావరణ అనుకూల ప్రాపర్టీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా సీఐఐ తెలంగాణ చైర్మన్ ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్బిల్డింగ్స్ను ఇష్టపడే ప్రాపర్టీ కొనుగోలుదారుతో డెవలపర్లు కనెక్ట్ కావడానికి ఈ వేదిక ఉపకరిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం భవనాల నిర్మాణాల్లో పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబిస్తోందని చెప్పారు. గ్రీన్ రేటెడ్ ప్రాజెక్ట్ల గురించి సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికే ఈ ప్రయత్నమని రెడ్డి వివరించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, రియల్టర్లు, ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైనర్లు, గ్రీన్ బిల్డింగ్స్ ప్రొడక్టుల తయారీదారులు పాల్గొన్నారు.
‘గ్రీన్’కు పెద్దపీట వేస్తాం
మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం పర్యావరణ అనుకూల విధానాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. కొత్త సచివాలయ భవనం, టీ-–హబ్, టీ–-వర్క్స్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త కలెక్టరేట్ భవనాలు, ఆస్పత్రులు, హెల్త్కేర్ క్యాంపస్లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ టవర్ల నిర్మాణంలో పచ్చదనానికి, పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం వల్ల పల్లెలన్నీ పచ్చగా మారాయని, చెట్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పారు. ‘గ్రీన్ బిల్డింగ్స్ విషయంలో తెలంగాణకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. భారతదేశపు మొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ హోమ్, గ్రీన్ ఎయిర్పోర్ట్, గ్రీన్ రైల్వే స్టేషన్, గ్రీన్ ఫ్యాక్టరీ.. ఇవన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దేశంలో గ్రీన్ హోమ్స్ కూడా పెరుగుతున్నాయి.
సీఐఐ–జీబీసీ హైదరాబాద్లో 10.27 బిలియన్ చదరపు అడుగుల్లో నిర్మాణాలను పూర్తిచేసింది’ అని చెప్పారు. భవనాలు, క్యాంపస్లు మాత్రమే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లలో ఐజీబీసీ ద్వారా గ్రీన్ సిటీస్ రేటింగ్ పెరుగుతోందని పేర్కొన్నారు. చెట్ల విస్తరణను గణనీయంగా పెంచుకున్నామని, దాంతో రాష్ట్రం మొత్తం పచ్చదనం పెరిగిందని తెలిపారు. గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను గ్రీన్ విలేజెస్గా మార్చేందుకు ఐజీబీఎస్ సహకారం కావాలని మంత్రి కోరారు. మున్సిపాలిటీలు సేకరించే చెత్త ద్వారా భారీ ఎత్తున కరెంటును తయారు చేస్తున్నామని, ఫలితంగా వాటికి భారీగా ఆదాయం వస్తోందని చెప్పారు.