- ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికలు వచ్చే అవకాశం
- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్ లతో మంత్రి కేటీఆర్ సమావేశం
హైదరాబాద్: నవంబరు రెండో వారం తరువాత ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని , అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులకు తెలిపారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్ లోని క్లబ్ హౌస్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్ లతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్ లో 15 మంది కార్పొరేటర్ ల పనితీరు బాగాలేదని, సర్వేలో అదే విషయం తెలిసిందని, ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కి ఇప్పటికి 60వేల కోట్ల రూపాయలు వెచ్చించామన్న కేటీఆర్.. కార్పోరేట్ లకు ఇంకా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టి కి తీసుకురావాలని చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకొని తెలియజేయాలని సూచించారు. ప్రతి కార్పోరేటర్ 3 వేల గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించాలని, అక్టోబర్1 న ప్రజాప్రతినిధులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలని కేటీఆర్ అన్నారు.