ఒక్కో కార్పొరేటర్…ఒక్కో కేసీఆర్ లా మారాలి

ఒక్కో కార్పొరేటర్…ఒక్కో కేసీఆర్ లా మారాలి

ఒక్కో కార్పొరేటర్…ఒక్కో కేసీఆర్ లా మారాలన్నారు మంత్రి కేటీఆర్. అప్పుడే అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు. నగరాల్లో పారిశుద్యం మెరుగుపడాలంటే…. డివిజన్ శానిటేషన్ ప్లాన్ ను రూపొందించడంతో పాటు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలన్నారు. పారిశుద్య నిర్మూళనలో ప్రతొక్కరూ పాల్గొనాలని సూచించారు. ఖమ్మం నగరంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో మంత్రి పాల్గొన్నారు. ఖమ్మం నగర అభివృద్దికి నెలకు 5 కోట్ల 42 లక్షలు ఇస్తామన్నారు .

పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్.. ఖమ్మం, ఇల్లందు పట్టణాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. కేటీఆర్ తో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్ లో హరిత ప్రణాళిక తయారు చేయాలన్నారు. నాటిన మొక్కల్లో 85శాతం బతకకపోతే కార్పోరేటర్ల పదవులు పోతాయని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన నిర్మాణాలను కూల్చేయడమే కాకుండా.. 25రేట్లు జరిమానా వేస్తామన్నారు.

పరిశుభ్రతకు కేరాఫ్ గా ఖమ్మం నగరాన్ని మారుస్తామన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధిని చేస్తామన్నారు. ఇప్పటికే ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు పువ్వాడ.

అంతకుముందు ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు. లకారం మినీ ట్యాండ్ బండ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇక్కడే స్కై సైక్లింగ్, ఒపెన్ జిమ్ ను కూడా మంత్రులతో కలిసి ఓపెన్ చేశారు. ట్యాంక్ బండ్ పైన మొక్కలు నాటారు కేటీఆర్.  అలాగే పెవిలియన్ గ్రౌండ్ లో ఇండోర్ బాస్కెట్ బాల్ స్టేడియం ప్రారంభించారు. దీంతోపాటు NCP క్యాంప్ దగ్గర వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను ఓపెన్ చేశారు కేటీఆర్. టూర్ లో భాగంగా చాలాచోట్ల కాన్వాయ్ ను ఆపి.. ప్రజలతో మాట్టాడారు కాల్వఒడ్డు ప్రాంతంలో పూలు, పండ్లు అమ్ముకుంటున్న వాళ్లను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి మురికి కాల్వలు అపరిశుభ్రంగా ఉండటంతో.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే ఖమ్మంలోని వైఎస్సార్ నగర్ లో 240, రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో 60 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. లబ్దిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించారు. అలాగే రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు కేటీఆర్.

ఖమ్మంలో పర్యటన తర్వాత నేరుగా ఇల్లెందు వెళ్లారు కేటీఆర్. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రజలనుద్దేశించి మాట్లాడారు.