- రేపటితో ముగియనున్న 37 కార్పొరేషన్, ఫెడరేషన్ల చైర్మన్ల పదవీకాలం
- ఇవి సహా 75 నామినేటెడ్
- పోస్టుల భర్తీకి సీఎంకు పీసీసీ లిస్ట్
- కొన్ని పేర్లపై సీఎం నుంచి అభ్యంతరాలు
- పంజాబ్ ఎన్నికల్లో బిజీబిజీగా మీనాక్షి నటరాజన్
- ఆమె వచ్చాకే కొలిక్కి రానున్న జాబితా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్పొరేషన్, ఫెడరేషన్ చైర్మన్ల పదవులతో పాటు ఇతర నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి విడత 37 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, ఫెడరేషన్ చైర్మన్ పదవులతో పాటు వైస్ చైర్మన్, సభ్యులను నియమించారు. 2024 జులై 7న రెండేండ్ల కాలపరిమితితో వీరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా ఆ మరుసటి రోజు మెజార్టీ చైర్మన్లు బాధ్యతలు తీసుకున్నారు. బుధవారంతో వీరి పదవీకాలం ముగియనుంది.
కొందరు ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా బాధ్యతలు తీసుకోవడంతో వారి పదవీకాలం మరో రెండు రోజులు ఉండనుంది. ఈ క్రమంలో వచ్చే రెండు, మూడు రోజుల్లో మొత్తం 37 పదవులు ఖాళీ కానున్నాయి. వీరిలో చాలా మంది రెన్యూవల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం కూడా కొందరు చైర్మన్లు తమ పదవి కాపాడుకునేందుకు వేం నరేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ఆయన నుంచి వారికి ఎలాంటి హామీ లభించలేదని తెలిసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మెజారిటీ చైర్మన్లను రెన్యూవల్ చేసేందుకు సిద్ధంగా లేరని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ 37 మంది పనితీరుపై సీఎం ఇప్పటికే రిపోర్టు తెప్పించుకున్నట్లు సమాచారం. దాని ఆధారంగా పాత చైర్మన్లలో రెన్యువల్ చేయదగినవారి సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితమైనట్లు తెలుస్తున్నది.
వీరికి కూడా రెన్యూవల్ చేయడం కన్నా.. మరో పదవి ఇచ్చేందుకే సీఎం మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం.
75 మందితో పీసీసీ చీఫ్ లిస్ట్..
పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ 75 మంది కొత్త నేతలను నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసి, ఆ జాబితాను సీఎంకు పంపించారు. ఇందులో బుధవారం ఖాళీ కానున్న పదవుల కూడా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, ఫెడరేషన్లకు సంబంధించి సభ్యుల నియామకంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు లేదా ఇద్దరికి అవకాశం కల్పించేలా, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా పీసీసీ చీఫ్ చూశారని చర్చ జరుగుతున్నది. కానీ ఆ జాబితాల్లోని కొన్ని పేర్లపై సీఎం అభ్యంతరాల కారణంగా పెండింగ్ పెట్టినట్లు పీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మీనాక్షి నటరాజన్ వచ్చాకే ముందుకు..
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం పంజాబ్ పర్యటనలో ఉన్నట్లు పీసీసీ నేతలు చెప్తున్నారు. అక్కడ త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె అక్కడికి వెళ్లినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ నెల 13న లేదంటే 18న ఆమె హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మహేశ్ గౌడ్ కూడా రెండు రోజులుగా రాష్ట్రంలో లేరు. కుటుంబంతో కలిసి ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో జాబితాపై రేవంత్రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ ఎప్పుడు సమావేశం కానున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ఈ ముగ్గురు నేతలు సమావేశమై జాబితాను పరిశీలించిన తర్వాతనే నామినేటెడ్ పదవుల నియామకంపై స్పష్టత రానుందని పీసీసీ నేతలు చెప్తున్నారు.
