హైదరాబాద్ :భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టీఎస్ బీ-పాస్(టీఎస్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్)పై గురువారం సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్లోని ఏ.సీ. గార్డ్స్లోని మునిసిపల్ కాంప్లెక్స్ లో జరిగిన సమావేశంలో పురపాలక శాఖ అధికారులు, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి మంత్రి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే 87 మునిసిపాలిటీల్లో టి ఎస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు.
జూన్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. టీఎస్ బీపాస్లో భాగస్వాములైన సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని చెప్పారు.
టీఎస్ బీపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్లైన్లో అనుమతులు పొందేందుకు వీలు ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకోసం మీసేవ సెంటర్ల తో పాటు పౌర సేవా కేంద్రాలు, వ్యక్తిగతంగా ఇంటర్నెట్ ద్వారా కానీ, మొబైల్ యాప్ ద్వారా గాని, ఇవేవి అందుబాటులో లేకుంటే నేరుగా కానీ అప్లికేషన్లు పెట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.