కేటీఆర్ పర్యటన.. ముందస్తు అరెస్టులు

కేటీఆర్ పర్యటన.. ముందస్తు అరెస్టులు

మంత్రి కేటీఆర్ ఇవాళ హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని పలు ప్రాంతల్లో విపక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని అనుమానంతో కాంగ్రెస్ నేత రోహిత్ రావు (ఎమ్మెస్సార్ మనవడు) సహా ఐదుగురిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. తనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచడం పట్ల రోహిత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అరెస్టు చేయొచ్చు కానీ భవిష్యత్తులో కేటీఆర్ ను అడ్డుకొని తీరుతామంటూ హెచ్చరించారు.  మరోవైపు వీణవంక మండలంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కరీంనగర్ లో టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ ను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా  ఉదయం 11 గంటలకు కరీంనగర్ నుంచి హెలీక్యాప్టర్ లో కమలాపూర్​కు రానున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బస్టాండ్, కుల సంఘ భవనాలు, టెంపుల్​ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే బాయ్స్, గ్లర్స్ హాస్టల్స్, కేజీబీవీ, ఇంటర్ కాలేజీ బిల్డింగులను ప్రారంభించనున్నారు. అనంతరం స్టూడెంట్లతో లంచ్ చేసి, రోడ్డు మార్గం ద్వారా కమలాపూర్ నుంచి జమ్మికుంటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.