సర్కారు  కొలువులు రావు.. హమాలీ పని చేసుకోవచ్చు

సర్కారు  కొలువులు రావు.. హమాలీ పని చేసుకోవచ్చు
  • కొనుగోలు కేంద్రాల్లో ఏటా ఐదు నెలల పాటు ఉపాధి
  • ఇంతకుమించిన ఎంప్లాయి​మెంట్ ​ఉంటదా?
  • వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వానాకాలం, యాసంగి సీజన్లలో ఐదు నెలలు సొంత పనులు చేసుకుంటూనే  హమాలీ పని చేసుకొనే వెసులుబాటు తెలంగాణలో గ్రామగ్రామానికి వచ్చింది. ఇంతకుమించిన ఉపాధి ఏముంటదని నేను అడుగుతున్న.. ఉపాధి అంటే ఇది కాదా అంటున్న.. ఉపాధి అంటే ఇదే.. ఎంప్లాయిమెంట్​ అంటే ఇదే.. ఇలాంటి విషయాలను చర్చకు పెట్టకుండా సదువుకున్నోళ్లందరికీ సర్కారు నౌకర్లు కావాలంటే ఎట్ల? నిరంజన్​రెడ్డి

నాగర్​కర్నూల్, వెలుగు: రాష్ట్రంలో చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలియ్యలేమని, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏటా ఐదు నెలలపాటు హమాలీ పని చేసుకునే వెసులుబాటు ఉందని, ఇంతకుమించిన ఉపాధి ఏముంటుందని వ్యవసాయమంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ‘ఉపాధి అంటే ఇదే.. ఎంప్లాయిమెంట్​అంటే ఇదే..’ అని హమాలీ పని గురించి ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. గురువారం నాగర్​కర్నూల్​జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన దిశ రివ్యూ మీటింగ్​కు హాజరైన మంత్రి ఈ వ్యాఖ్యలు  చేశారు. 

‘తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వానకాలం, యాసంగి సీజన్లలో రెండు నుంచి రెండున్నర నెలలు సొంత పనులు చేసుకుంటూనే  హమాలీ పని చేసునునే వెసులుబాటు రాష్ట్రంలో గ్రామగ్రామానికి వచ్చింది. ఇంతకుమించిన ఉపాధి ఏముంటదని నేను అడుగుతున్న.. ఉపాధి అంటే ఇది కాదా అంటున్న.. ఉపాధి అంటే ఇదే.. ఎంప్లాయిమెంట్ ​అంటే ఇదే.. ఇలాంటి విషయాలను చర్చకు పెట్టకుండా సదువుకున్నోళ్లందరికీ సర్కారు నౌకర్లు కావాలంటే ఎట్ల?’  అని నిరంజన్​రెడ్డి ప్రశ్నించారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదన్నారు. కేంద్రంలో, పక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అక్కడ ఉద్యోగాలు పీకేసి,  ఇక్కడ మాత్రం ఇవ్వాలని ఉద్యమాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్మలకు పాల్పడితే కామన్ ​సెన్స్ ​లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇష్టమున్నయి వేసి.. కొనాలంటే కుదరదు 
రాష్ట్రంలో సన్నాలు, పత్తి సాగును ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్​రెడ్డి చెప్పారు. రైతు వేదికల ద్వారా శిక్షణ, ప్రచారం కల్పిస్తామన్నారు. మార్కెట్​లో డిమాండ్​ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇష్టం ఉన్న పంటలు వేసి ప్రభుత్వం కొనాలంటే కుదరదన్నారు. ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల వడ్డీలకే ప్రభుత్వంపై ఏటా రూ.1500 కోట్ల భారం పడుతోందన్నారు. మండలానికి ఒక మెగా పార్క్​ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన మంత్రి, ఆఫీసర్లు లెక్కల​మీద కాకుండా రిజల్ట్స్​మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, విప్ ​గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్​ రెడ్డి, జైపాల్​ యాదవ్, జెడ్పీ చైర్​పర్సన్​పద్మావతి, కలెక్టర్​శర్మన్, అదనపు కలెక్టర్​మనూ చౌదరి, అధికారులు పాల్గొన్నారు.
నా మాటలను వక్రీకరించారు
నాగర్ కర్నూల్​ జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన దిశ సమీక్షలో తాను నిరుద్యోగులపై చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించడం బాధాకరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మంత్రి వనపర్తిలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఉపాధి అవకాశాలు పెంచామని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని అన్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నారని తాను అన్నట్టుగా ప్రచారం చేయడం విచారకరమన్నారు.

మీడియా సంస్థలపై..కేసు నమోదు
నాగర్ కర్నూల్ టౌన్​లో దిశ రివ్యూ మీటింగ్​లో మంత్రి నిరంజన్ రెడ్డి అన్న మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయంటూ.. వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్​సోషల్ మీడియా ఇన్​చార్జి గంగాపూర్ విక్రమ్ బాబు ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లయింట్ మేరకు వే2న్యూస్, దిశ డైలీ డాట్ కమ్, 6టీవీ, టీవీ9 యాజమాన్యాలపై కేసు నమోదు చేసినట్లు వనపర్తి టౌన్ ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. నాగర్​కర్నూల్​లో కూడా స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్‌‌‌‌‌‌‌‌..  డీఎస్పీ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.