
- వీలైనంత తొందరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూసమస్యలపై 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆగస్టు 15 డెడ్లైన్ అని చెప్పారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో శనివారం అధికారులతో పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్లలో రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పేందుకు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులే నిదర్శనమన్నారు. ‘‘ఏప్రిల్ 14న భూభారతి ప్రారంభమైంది.
ఈ చట్టాన్ని దశల వారీగా అమల్లోకి తెచ్చాం. మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి 30 వరకు 4 మండలాల్లో నిర్వహించిన 72 రెవెన్యూ సదస్సుల్లో 12 వేల దరఖాస్తులు వచ్చాయి. రెండో దశలో మే 5 నుంచి 28 మండలాల్లో నిర్వహించిన 414 సదస్సుల్లో 46 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో సాదాబైనామా దరఖాస్తులు మినహా సుమారు 60 శాతానికి పైగా సమస్యలకు పరిష్కారం చూపాం. ఈ నెల 3 నుంచి 20 వరకు 561 మండలాల్లో 10,239 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించగా 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
మొత్తంగా మూడు విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67 వేలు, భద్రాద్రి కొత్తగూడెం 61 వేలు, వరంగల్ 54 వేలు, జయశంకర్ భూపాలపల్లి 48 వేలు, నల్గొండలో 42 వేల దరఖాస్తులు వచ్చాయి” అని వివరించారు. ఇప్పటి వరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని చెప్పారు. మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.