పాడైంది పన్ను కాదు వెన్నెముక! : మంత్రి పొంగులేటి

పాడైంది పన్ను కాదు వెన్నెముక! : మంత్రి పొంగులేటి

హైదరాబాద్: మనిషి దేహంలో ఒక పన్ను పాడేతే పీకేసుకుంటామని, కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముకలాంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిన్న కరీంనగర్  సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు.  మనిషి శరీరంలో కాళ్లు, చేతులు, ముక్కు, మొఖం  ఇలా అన్ని బాగానే ఉన్నా వెన్నెముక విరిగిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  మేడిగడ్డ తర్వాత అన్నారం సుందిళ్ల పరిస్థితీ ఆందోళనకరంగా మారిందన్నారు. కేసీఆర్ అవినీతి జబ్బు ఒక మేడిగడ్డకే  పరిమితం కాలేదని ఆ జబ్బు అన్నారం సుందిళ్ళకు కూడా పాకిందని పేర్కొన్నారు.  తానే ఇంజినీర్, డిజైనర్, తాపీ మేస్త్రి అనేలా వ్యవహరించారని విమర్శించారు. కేసీఆర్ అవినీతికి, అహంకారానికి, మూర్ఖత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనమననారు. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 22 పిల్లర్లలో దాదాపు 7 పిల్లర్లు 3 ఫీట్ల మేర కుంగాయని ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ, ఇంజినీరింగ్  నిపుణులు, రైతుసంఘాల నేతలు, మేధావులు అందరూ ఏకరువు పెడుతుంటే అపర మేధావి కేసీఆర్ మాత్రం సమప్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  

కుర్చీ మడత పెట్టిండ్రు

భూమి ఆకాశం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గత్తర లేప్త.. భూకంపం సృష్టిస్తానంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి సొంత రాష్ట్రంలో ఓటమి పాలై కుర్చీ మడతపెట్టారని అన్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితిలో ఆ పార్టీ ఉన్నదని చెప్పారు.  కేసీఆర్  పాలనలో జరిగిన పాలనపరమైన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరువుకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ? మా ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన ఏర్పడిందని, అప్పటికే వర్షాకాలం సీజన్ ముగిసిందనే  విషయాన్ని కేసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు.

ప్రజలు అత్యాశకు పోయారా?

ప్రజలు అత్యాశకు పోయారని, ప్రజాతీర్పును కేసీఆర్ చులకన చేస్తున్నారని ‘తనకు ఓట్లు వేసినంత కాలం ప్రజలు మంచివారు, వ్యతిరేకంగా ఓటు  వేస్తే మాత్రం ప్రజలకు తెలివి లేదు మూర్ఖులు’అన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని పొంగులేటి మండిపడ్డారు.  సీఎం రేవంత్ రెడ్డి భాష గురించి కేసీఆర్ మాట్లాడడం దయ్యాలు వేదాలను వల్లించినట్లు ఉందన్నారు.  పీకడానికి , తోక  మట్ట,  బొందలగడ్డ, సన్యాసి, రండ  వంటి పదాలను అలవోకంగా వదిలేసింది కేసీఆర్ కాదా ? తెలంగాణ రాజకీయాల్లో తిట్లకు కేసీఆర్ ఆద్యుడన్నారు.