హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం.. రూ.5 కే రోజుకో వెరైటీ బ్రేక్ ఫాస్ట్

హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం.. రూ.5 కే రోజుకో వెరైటీ బ్రేక్ ఫాస్ట్

బతుకమ్మ పండుగ కానుకగా ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించింది ప్రభుత్వం. సోమవారం (సెప్టెంబర్ 29) హైదరాబాద్లోని మోతినగర్ , ఖైరాతాబాద్ మింట్ కంపౌండ్ దగ్గర లో క్యాంటీన్లను ప్రారంభారు జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్. కొబ్బరి కాయ కొట్టి క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి.. మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి స్వయంగా వివిధ రకాల టిఫిన్లను వడ్డించారు. 

బ్రేక్ ఫాస్ట్ లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నగర జీవికి నిత్యం అందించనున్నట్లు ఈ సందర్భంగం మంత్రి తెలిపారు. ప్లేట్ టిఫిన్ తయారీకి 19 రూపాయలు ఖర్చవుతుందని.. అయినా ప్రభుత్వం 14 రూపాయలు భరించి 5 రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నట్లు చెప్పారు. 

ప్రభుత్వం ప్రారంభించిన 5 రూపాయల బ్రేక్ ఫాస్ట్ బాగుందని ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, కార్పోరేటర్లు పాల్గొన్నారు. 

 రూ.5 కే  బ్రేక్ ఫాస్ట్ స్కీమ్​ను మొత్తం 150 కేంద్రాలకుగాను మొదటి దశలో 60 కేంద్రాల్లో రూ.5  బ్రేక్ ఫాస్ట్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్ల లో బ్రేక్ ఫాస్ట్ ని జీహెచ్ఎంసీ అందించనుంది. డైలీ  25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ ని ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు. 

మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరితో పాటు  పొంగల్ అందించనున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు అందించేందుకు హరిక‌‌ృష్ణా ఫౌండేషన్‌‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి ఏడాదికి రూ.10కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. క్యాంటీన్లకు  ఆదివారం రోజు సెలవు ఉండనుంది.

 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే

నగరంలోని చిరు వ్యాపారులు, అడ్డా కూలీలు, నగరానికి వివిధ పనులపై వచ్చే వారికి తక్కువ ధరలో భోజనం అందుబాటులో ఉండేలా 2013లో అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వం రూ.5కే  భోజన పథకాన్నిమొదటగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద  ప్రారంభించింది. రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, అడ్డాకూలీలు ఉండే ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసింది.  

ప్రస్తుతం నగరంలో 150 కేంద్రాల్లో డైలీ   సుమారు 30వేల మంది భోజనం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 12కోట్ల మందికి భోజనం అందించారు. 150 కేంద్రాలకుగాను ప్రస్తుతం 128 కేంద్రాల్లో మాత్రమే భోజనం అందిస్తున్నారు. మిగిలిన కేంద్రాల్లో మరమత్తుల కారణంగా తాత్కాలికంగా నిలిపేశారు.