
- వేధింపులు లేకుండా స్కూల్ బస్సులు ఫిట్నెస్ తనిఖీలు
- గురుకుల పాఠశాలల్లో ఏ ఒక్క సీటు కూడా ఖాళీ ఉండకూడదు
- సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖలో రూల్స్ నిక్కచ్చిగా అమలు చేయాలని, అదే సమయంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ తనిఖీలను ఎలాంటి వేధింపులు లేకుండా చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్కూళ్లలో పిల్లలకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి స్కూల్లో ‘చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కు’లు ఏర్పాటు చేసేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-–పాలసీ వల్ల ప్రజలు ఈవీ పట్ల ఆసక్తి చూపిస్తున్నారని అధికారులు మంత్రికి వివరించారు. ఈమేరకు సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘మహాలక్ష్మి పథకం’ ద్వారా ఇప్పటివరకు 186.5 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో రూ.6,222 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేశారని అధికారులు నివేదించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకులాల్లో ఒక్క ఖాళీ సీటు కనిపించకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లను అందజేయాలని సూచించారు. మీటింగ్లో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, గురుకుల సెక్రటరీ సైదులు తదితరులు పాల్గొన్నారు.