జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పం: పొన్నం ప్రభాకర్

జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పం: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్/బషీర్​బాగ్,​ వెలుగు: ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే) ఆధ్వర్యంలో సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫయాజ్​మహమ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్య​అతిథిగా మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా ఉండాలని సూచించారు. త్వరలో హెచ్ యూ జేతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జర్నలిస్టుల సమస్యలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. 

అక్రిడిటేషన్, హెల్త్ కార్డ్స్ , ఇండ్ల స్థలాల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డికి ఫయాజ్ మహమ్మద్ అస్గర్ మెమోరియల్ అవార్డును అందజేశారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, కార్యదర్శి వి.యాదగిరి , కోశాధికారి వెంకట్ రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి , హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్ కుమార్, టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఎ.రాజేశ్, అనిల్, గౌస్ మోహినుద్దీన్ తదితరులను మంత్రి పొన్నం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, హెచ్ యూ జే అధ్యక్షుడు శిగ శంకర్ గౌడ్, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఏ మాజీద్, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, హెచ్ యూ జే కార్యదర్శి అబ్దుల్ హమీద్ షౌకత్, ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేఎన్ హరి, తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.